PoK: పీఓకేలో బ్రిటీష్ హైకమిషనర్ పర్యటించడంపై భారత్ ఆగ్రహం
పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో బ్రిటీష్ రాయబారి పర్యటించడంపై భారత్ శనివారం అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్థాన్లోని యూకే హైకమిషనర్ జేన్ మారియట్ జనవరి 10న పీఓకేలోని మీర్పూర్ను సందర్శించారు. భారత సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించడం ఆమోదయోగ్యం కాదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంపై విదేశాంగ కార్యదర్శి భారతదేశంలోని బ్రిటీష్ హైకమిషనర్ను పిలిపించి తీవ్ర నిరసన తెలిపారు. భారత విదేశాంగ కార్యదర్శి ప్రకారం.. జమ్ముకశ్మీర్, లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నాయి.
బ్రిటీష్ పాకిస్థానీల్లో 70 శాతం మంది మీర్పూర్ నుంచే
పాకిస్థాన్లోని బ్రిటన్ హైకమీషనర్ జేన్ మారియట్ జనవరి 10న పీఓకే సందర్శించారు. ఆ ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్-పాకిస్థాన్ ప్రజల మధ్య సంబంధాలకు మీర్పూర్ గుండెకాయ లాటిందన్నారు. బ్రిటీష్ పాకిస్థానీల్లో 70శాతం మంది మీర్పూర్కు చెందినవారే ఉన్నట్లు పేర్కొన్నారు. కాబట్టి ప్రవాసుల ప్రయోజనాల కోసం అందరం కలిసి పనిచేయాలని జేన్ మారియట్ ట్వట్టర్ వేదికగా చెప్పారు. ఫిబ్రవరి 8న పాక్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం కీలకంగా మారింది. జేన్ మారియట్ జనవరి 8న కూడా ఓ ట్వీట్ చేశారు. అందులో ఇలా రాశారు. ప్రస్తుతం తాను కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్లోని అన్ని ముఖ్యమైన రాజకీయ పార్టీలతో సమావేశమవుతున్నట్లు పేర్కొన్నారు.