PM Modi: ప్రపంచ క్రీడలకు భారత్ వేదికగా మారుతోంది: నరేంద్ర మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ఒలింపిక్స్-2036 క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సంపూర్ణంగా సిద్ధమవుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పదేళ్ల కాలంలో భారత్ అనేక అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లకు విజయవంతంగా వేదికగా నిలిచిందని ఆయన గుర్తు చేశారు. వారణాసిలో జరుగుతున్న 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని మాట్లాడారు. గత దశాబ్దంలో దేశవ్యాప్తంగా 20కి పైగా అంతర్జాతీయ క్రీడా పోటీలను నిర్వహించినట్లు ప్రధాని తెలిపారు. అండర్-17 ఫిఫా వరల్డ్కప్, హాకీ వరల్డ్కప్, అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ వంటి మెగా ఈవెంట్లకు భారత్ సమర్థవంతంగా ఆతిథ్యం ఇచ్చిందన్నారు. ఇదే క్రమంలో 2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ కూడా భారత్లోనే నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Details
క్రీడల కోసం దేశం అన్ని విధాలుగా సన్నద్ధం
2036 ఒలింపిక్ క్రీడల కోసం దేశం అన్ని విధాలుగా సన్నద్ధమవుతోందని మోదీ పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి ప్రయాణాన్ని వాలీబాల్ ఆటతో పోల్చిన ప్రధాని, ఏ విజయం అయినా ఒక్కరి కృషితో సాధ్యంకాదని అన్నారు. సమన్వయం, పరస్పర విశ్వాసం, జట్టు సంసిద్ధతే విజయానికి మూలమని చెప్పారు. ప్రతి ఒక్కరికీ పాత్ర, బాధ్యత ఉంటుందని, వాటిని సమర్థంగా నిర్వహించినప్పుడే సమిష్టి విజయం సాధ్యమవుతుందని వివరించారు. జనవరి 4నుంచి 11వరకు జరిగే ఈ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్లో దేశం నలుమూలల నుంచి 58sజట్లు పాల్గొంటున్నాయి. వెయ్యికి పైగా క్రీడాకారులు ఈ పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. ఈ టోర్నమెంట్తో వారణాసి జాతీయ స్థాయి క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రధాన వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.