US trade deal: భారత్-అమెరికా ఒప్పందంలో కీలక రంగాలకు మినహాయింపు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-అమెరికా మధ్య కుదిరే వాణిజ్య ఒప్పందంలో సున్నితమైన వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులను బయటే ఉంచే తమ పాత వైఖరినే భారత్ కొనసాగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ రంగాల్లో పెద్దగా మార్కెట్ ఓపెనింగ్కు అంగీకరించే పరిస్థితి లేదని ఒక ఉన్నతాధికారి స్పష్టం చేశారు. "ఇప్పటివరకు ఏ విధానం ఉందో అదే కొనసాగుతుంది.వ్యవసాయం,పాల ఉత్పత్తుల విషయంలో తీసుకుంటున్న సాధారణ వైఖరి మారే అవకాశం లేదు," అని ఆయన చెప్పారు. అయితే, ఈ విషయంపై అధికారికంగా మాట్లాడేందుకు అనుమతి లేకపోవడంతో పేరు వెల్లడించనని తెలిపారు. వాణిజ్య చర్చల్లో భారత్ సంప్రదాయంగా పాటిస్తున్న విధానానికే ఇది నిదర్శనమని నిపుణులు అంటున్నారు.
వివరాలు
భారత ఉత్పత్తులపై అమెరికా విధించే పరస్పర సుంకాలు 18 శాతం
ఇటీవల బ్రిటన్, న్యూజిలాండ్, యూరోపియన్ యూనియన్లతో జరిగిన వాణిజ్య ఒప్పందాల్లో కూడా కీలకమైన వ్యవసాయ, డెయిరీ ఉత్పత్తులను భారత్ మినహాయించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 2న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'ట్రూత్ సోషల్' వేదికగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. ఈ ఒప్పందం ద్వారా 2025 మధ్య నుంచి అమలులోకి వచ్చిన పరస్పర సుంకాలు గణనీయంగా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం, భారత ఉత్పత్తులపై అమెరికా విధించే పరస్పర సుంకాలను 18 శాతానికి తగ్గిస్తామని ట్రంప్ తెలిపారు. అదే సమయంలో, అమెరికా నుంచి భారత్కు దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు సున్నా శాతానికి తగ్గే అవకాశం ఉందని చెప్పారు.
వివరాలు
వాణిజ్య ఒప్పందం లో తొలి దశ మాత్రమేనా? లేక పూర్తిస్థాయి బీటీఏనా?
ప్రస్తుతం రెండు దేశాల ప్రతినిధులు ఈ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన పత్రాల తయారీలో నిమగ్నమై ఉన్నారని, వాటిపై చర్చలు కొనసాగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ ఒప్పందం విస్తృత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బిలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ - BTA)లో తొలి దశ మాత్రమేనా? లేక పూర్తిస్థాయి బీటీఏనా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. 2025 ఫిబ్రవరిలో ఈ బీటీఏపై చర్చలు ప్రారంభించాలని భారత్, అమెరికా నిర్ణయించిన విషయం తెలిసిందే.