Highway Monetization: జాతీయ రహదారుల లీజుతో రూ.35 వేల కోట్లు.. కేంద్రం మెగా ప్లాన్!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో రవాణా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారీ కార్యాచరణను అమలు చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల ఆధారంగా నిధులు సమీకరించి, వాటితో కొత్త రహదారులు, ఎక్స్ప్రెస్ మార్గాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో 28 ప్రధాన జాతీయ రహదారులను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇచ్చి రూ.35 వేల కోట్లు సమీకరించాలని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
వివరాలు
అసెట్ మోనెటైజేషన్ అంటే ఏమిటి?
ప్రభుత్వ ఆస్తులను పూర్తిగా అమ్మకుండా, కొంతకాలం పాటు వాటి నిర్వహణ హక్కులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించి నిధులు సమీకరించే విధానాన్ని 'ఆస్తుల నగదీకరణ'గా పిలుస్తారు. ఇందులో భాగంగా సుమారు 1,800 కిలోమీటర్ల పొడవున్న 28 జాతీయ రహదారులను టోల్ నిర్వహణ-బదిలీ విధానం లేదా మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్టు పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. ఈ విధానంలో ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వానికి ముందుగానే భారీ మొత్తాన్ని చెల్లించి, ఆ రహదారులపై టోల్ వసూలు చేసే హక్కును పొందుతాయి. ఇలా సమీకరించిన నిధులను కొత్త ఎక్స్ప్రెస్ మార్గాల నిర్మాణం, రహదారి విస్తరణ పనుల కోసం వినియోగించనున్నారు.
వివరాలు
హర్యానా, ఉత్తరప్రదేశ్ రహదారులకు అధిక ప్రాధాన్యం
ఎన్హెచ్ఏఐ సిద్ధం చేసిన జాబితాలో హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన జాతీయ రహదారులే ఎక్కువగా ఉన్నాయి. ఈ మార్గాల్లో వాహనాల రాకపోకలు అధికంగా ఉండటంతో పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా విదేశీ పెన్షన్ నిధులు, సార్వభౌమ సంపద నిధులు భారత రహదారి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు కేంద్రం నిబంధనలను మరింత సులభతరం చేస్తోంది. గత ఏడాది కేవలం నాలుగు రాష్ట్రాలకు చెందిన 260 కిలోమీటర్ల రహదారుల ద్వారానే కేంద్రం రూ.9 వేల కోట్లు సమీకరించడం ఈ విధానానికి ఉన్న అవకాశాలను స్పష్టంచేస్తోంది.
వివరాలు
ప్రజలకు కలిగే లాభాలు ఇవే..
ఈ ప్రణాళిక అమలుతో ప్రజలకు పలు విధాలుగా ప్రయోజనం కలగనుంది. ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నిధులు అందుబాటులోకి రావడంతో కొత్త రహదారుల నిర్మాణం వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రవాణా వ్యయాలు కూడా నియంత్రణలో ఉండే అవకాశముంది. అలాగే మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్టుల ద్వారా సాధారణ ప్రజలు కూడా జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టవచ్చు.
వివరాలు
ప్రజలకు కలిగే లాభాలు ఇవే..
వాటాల్లో పెట్టుబడి పెట్టిన వారికి టోల్ ఆదాయం ద్వారా లాభాంశం రూపంలో ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. దీన్ని తక్కువ ప్రమాదం ఉన్న పెట్టుబడి మార్గంగా నిపుణులు భావిస్తున్నారు. ఈ మొత్తం కార్యాచరణ 'జాతీయ నగదీకరణ ప్రణాళిక 2.0'లో భాగంగా కొనసాగుతోంది. 2026 నుంచి 2030 మధ్య కాలంలో రహదారుల రంగం నుంచే రూ.4.42 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది.