Drugs: భారత్లో తొలిసారి 'జిహాదీ డ్రగ్' పట్టివేత.. రూ.182 కోట్ల క్యాప్టగాన్ స్వాధీనం
ఈ వార్తాకథనం ఏంటి
మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోంది. దేశం మీదుగా పశ్చిమాసియాకు భారీ మొత్తంలో డ్రగ్స్ తరలించే ప్రయత్నాన్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అడ్డుకుంది. ఈ ఆపరేషన్లో భాగంగా తొలిసారిగా 'జిహాదీ డ్రగ్'గా పిలిచే క్యాప్టగాన్ను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు రూ.182 కోట్లు ఉంటుంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 'డ్రగ్ ఫ్రీ ఇండియా' లక్ష్యంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. 'ఆపరేషన్ రేజ్పిల్'లో భాగంగా ఎన్సీబీ ఈ భారీ డ్రగ్స్ రాకెట్ను బట్టబయలు చేసిందని తెలిపారు.
వివరాలు
ఇండియాలో తొలిసారి స్వాధీనం
'జిహాదీ డ్రగ్'గా పిలవబడే క్యాప్టగాన్ను భారత్లో తొలిసారిగా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ డ్రగ్స్ను పశ్చిమాసియాకు తరలిస్తున్న సమయంలో పట్టుకోవడంతో పాటు ఒక విదేశీయుడిని కూడా అరెస్టు చేసినట్లు చెప్పారు. మాదక ద్రవ్యాలపై జీరో టోలరెన్స్ విధానానికి ఈ ఆపరేషన్ నిదర్శనమని అమిత్ షా పేర్కొన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దేశంలో డ్రగ్స్ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని పునరుద్ఘాటించారు. ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసిన ఎన్సీబీ అధికారులను అమిత్ షా అభినందించారు. సంబంధిత అధికార వర్గాల సమాచారం ప్రకారం.. ఈ డ్రగ్స్ను ముంద్రా పోర్ట్తో పాటు నెబ్ సరై ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్నారు.