Republic Day 2026: 'ఆపరేషన్ సిందూర్' తర్వాత భారత్ తొలి రిపబ్లిక్ డే పరేడ్ - దీని ప్రత్యేకత ఏంటీ?
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధానిలో ఈ ఏడాది జరగబోయే 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్ ప్రతి సారి చూసే సంప్రదాయాలకంటే వేరుగా ఉండనుంది. ఇందులో శత్రుదేశంతో యుద్ధ పరిస్థితుల్లో సైన్యం ఎలా రక్షణ, దాడి, వ్యూహాలను అమలు చేస్తుందో ప్రత్యక్షంగా చూపించనున్నారు. భారత్ 'ఆపరేషన్ సిందూర్'ను పాకిస్తాన్పై చేపట్టిన తర్వాత నిర్వహిస్తున్న మొదటి రిపబ్లిక్ డే కావడంతో, ఈసారి భారత సైన్యం పరేడ్లో నిజమైన యుద్ధరంగ దృశ్యాన్ని ప్రతిబింబించేలా తన శక్తి, నైపుణ్యాన్ని ప్రదర్శించనుంది.
వివరాలు
మొదటిసారిగా పరేడ్లో..
మొదటిసారిగా పరేడ్లో సైనిక దళాలు తమ ఆయుధాలను రణరంగంలో ఎలా ఉపయోగిస్తారో అదే విధంగా ప్రదర్శించనున్నారు. నిఘా, హై మొబిలిటీ వాహనాలు, బ్యాటిల్ ఫీల్డ్ సర్వైలెన్స్ రాడార్లు, డ్రోన్లు మొదట చూపించబడతాయి. ఆ తర్వాత యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లను ప్రదర్శించనున్నారు.భూతలంపై సైనిక దళాలపై గగనతల నుండి దాడి చేసే అపాచీ హెలికాప్టర్లు,తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు కర్తవ్య పథం మీదుగా దూసుకెళ్తూ శక్తి సామర్థ్యాన్ని చూపిస్తాయి. ట్యాంకుల బలం... ముందుగా భూతల యుద్ధంలో కీలకమైన టీ-90 యుద్ధ ట్యాంక్లు, అర్జున్ యుద్ధ ట్యాంక్, బీఎంపీ-2 ఇన్ఫాంట్రీ కాంబాట్ వాహనాలు,ఎన్ఏఎంఐఎస్-2 నాగ్ మిసైల్ వ్యవస్థలు పరేడ్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. భారత్లో తయారైన ఆధునిక ఆయుధాలు,ఆకాశ్,బ్రహ్మోస్,బరాక్-8 వంటి గగనతల రక్షణ వ్యవస్థలను కూడా ప్రదర్శించనున్నారు.
వివరాలు
ఆధునిక యుద్ధ సాంకేతికత:
ఈసారి భవిష్యత్ యుద్ధాల ప్రధాన సాంకేతికతలపై దృష్టి పెట్టారు. ఇంటిగ్రేటెడ్ ఆపరేషనల్ సెంటర్, అన్మ్యాన్డ్ గ్రౌండ్ వాహనాలు, ఆల్-టెర్రెయిన్ వాహనాలు, రోబోటిక్ మ్యూల్స్తో లైట్ స్ట్రైక్ వాహనాలు, రోబోటిక్ డాగ్స్ వంటి ఆధునిక పరికరాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. సంప్రదాయం మరియు ఆధునికత కలబోతగా జాన్స్కర్ పొనీలు, బ్యాక్ట్రియన్ ఒంటెలు, సైనిక డాగ్ స్క్వాడ్, లాజిస్టిక్స్ యూనిట్లు పరేడ్లో భాగమవుతాయి.
వివరాలు
పరేడ్ ముగింపు:
ఇన్ఫాంట్రీ దళాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన 'భైరవ్ లైట్ కమాండో బెటాలియన్' మొదటి సారి పాల్గొంటుంది. 'ఉంచా కదమ్ తాల్'తో మార్చింగ్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆపై అత్యాధునిక రాఫెల్, సుఖోయ్-30, మిగ్-29 యుద్ధవిమానాలు వైమానిక ప్రదర్శనలు చేస్తాయి. వీటి వెంట అపాచీ, తేలికపాటి యుద్ధ విమానాలు, ఏఎల్హెచ్ సహా భారీ సరుకు రవాణా విమానాలు తమ సామర్థ్యాన్ని చూపిస్తాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్ కేవలం సంబరమే కాకుండా, భారత సైన్యా శక్తిని, ఆధునిక సాంకేతికతను, దేశీయ ఆయుధాలను, కొత్త కమాండో యూనిట్లను ప్రపంచానికి చూపించే ప్రత్యేకంగా రూపకల్పన చేయబడింది.