kamikaze drones: ఆర్మీకి కొత్త అస్త్రం.. శత్రువులకు క్షణాల్లో చెక్ పెట్టే ఆత్మాహుతి డ్రోన్లు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత సైన్యం తన ఆయుధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. ఆధునిక యుద్ధాల్లో కీలక పాత్ర పోషించే ఆత్మాహుతి డ్రోన్లు (కాముకాజి డ్రోన్లు) తాజాగా ఆర్మీకి చేరినట్లు సమాచారం. ఈ రకానికి చెందిన వందలాది డ్రోన్లను స్వదేశీ సంస్థ సైన్యానికి అందజేసినట్టు తెలుస్తోంది. రక్షణశాఖ వర్గాల సమాచారం మేరకు పలు ఆంగ్ల మీడియా కథనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. సుమారు రూ.10కోట్ల ఒప్పందంలో భాగంగా ఈ సరఫరా జరిగినట్లు తెలిసింది. గత ఏడాది ఏప్రిల్లో జరిగిన పహల్గాం ఘటన తర్వాత సరిహద్దుల భద్రత విషయంలో భారత్ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. శత్రువులపై దాడులు జరిపేటప్పుడు సైనికుల ప్రాణ నష్టం తగ్గించేందుకు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఆత్మాహుతి డ్రోన్లను సమకూర్చుకుంటోంది.
వివరాలు
ఆర్మీ నార్తర్న్ కమాండ్కు వందలాది డ్రోన్లు
ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబరులో కేంద్ర రక్షణశాఖ పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ ఒప్పందాల భాగంగా గుజరాత్లోని సూరత్కు చెందిన 'ఇన్సైడ్ ఎఫ్పీవీ' సంస్థ వందలాది డ్రోన్లను ఆర్మీ నార్తర్న్ కమాండ్కు అప్పగించినట్లు సమాచారం. అయితే భద్రతా కారణాల వల్ల ఖచ్చితమైన సంఖ్యను వెల్లడించలేదు. ముఖ్యంగా కేవలం రెండు నెలల్లోనే ఈ డ్రోన్లను సరఫరా చేయడం విశేషంగా నిలిచింది. అత్యవసర కొనుగోలు విధానంలో వీటిని సైన్యం పొందినట్లు తెలుస్తోంది.
వివరాలు
ఆత్మాహుతి డ్రోన్ల ప్రత్యేకతలు ఇవే:
ఈ డ్రోన్లు గంటకు సుమారు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత గైడెన్స్తో లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదిస్తాయి. గరిష్ఠంగా 2.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలపై దాడులు చేయగలవు. సుమారు 2.5 కిలోల వరకు పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలవు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి శత్రు ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లగలవు. సైనిక దళాలు చేరలేని క్లిష్ట ప్రాంతాల్లో కూడా దాడులు చేయగలవు. జీపీఎస్ అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా పనిచేసేలా రూపొందించారు. కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకుని, మైనస్ 35 డిగ్రీల వరకు కూడా సమర్థంగా పనిచేస్తాయి.