NEET Row: నీట్ వివాదం.. ఐదు దేశాల్లో భారతీయుల నిరసనలు
ఈ వార్తాకథనం ఏంటి
నీట్ (NEET) వివాదం,అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ భారత్లో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా భారతీయ ప్రవాసులు ఐదు దేశాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. యునైటెడ్ కింగ్డమ్ (యూకే), ఐర్లాండ్, కెనడా, జర్మనీ, నెదర్లాండ్స్లో ఈ నిరసనలు జరిగాయి. ఢిల్లీలో నిరసనకారులపై పోలీసులు తీసుకున్న చర్యలను వ్యతిరేకిస్తూ విదేశాల్లోని భారతీయులు ర్యాలీలు చేపట్టారు. వీటిలో లండన్లోని భారత హైకమిషన్ కార్యాలయం ఎదుట నిర్వహించిన నిరసన అత్యంత భారీగా జరిగింది. యూకేలోని లండన్,ఎడిన్బరో,గ్లాస్గో, మాంచెస్టర్ నగరాల్లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో లేదా సంఘీభావ కార్యక్రమాల రూపంలో నిరసనలు నిర్వహించారు.
వివరాలు
నిరసనలు కేవలం నీట్ లేదా సీబీఎస్ఈ అంశాలకే పరిమితం కాలేదు
సామాజిక మాధ్యమాల్లో వచ్చిన స్పందన ఆధారంగా సుమారు 200మంది వస్తారని భావించినా, లండన్లో మాత్రమే వెయ్యి మందికి పైగా పాల్గొన్నట్లు ఎస్ఎఫ్ఐ కేంద్ర కార్యవర్గ సభ్యుడు, గ్లాస్గోకు చెందిన విద్యావేత్త నిఖిల్ మాథ్యూ తెలిపారు.
నిరసనలు కేవలం నీట్ లేదా సీబీఎస్ఈ అంశాలకే పరిమితం కాలేదని ఆయన చెప్పారు.
దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితులు,నిరసనకారుల పట్ల ఢిల్లీ పోలీసుల వ్యవహారం,కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కూడా పలువురు ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షా,కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కొందరు నిరసనకారులు డిమాండ్ చేసినట్లు తెలిపారు.
దేశ భవిష్యత్తుపై ఆందోళన,ప్రజాస్వామ్య విలువలు బలహీనపడుతున్నాయనే భావన చాలా మందిలో కనిపించిందని ఆయన అన్నారు.
వివరాలు
వాంకూవర్లో భారతీయులు ఆందోళన
నెదర్లాండ్స్లోని హేగ్లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు సమీపంలో,జర్మనీలోని బెర్లిన్,ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లోని భారత రాయబార కార్యాలయాల ఎదుట కూడా నిరసనలు జరిగాయి.
కెనడాలోని వాంకూవర్లో కూడా భారతీయులు ఆందోళన చేపట్టారు.
ఇదే తరహా కార్యక్రమాన్ని న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో కూడా నిర్వహించేందుకు అక్కడి విద్యార్థులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని నిఖిల్ మాథ్యూ వెల్లడించారు.
వివరాలు
నిరసనల్లో సుమారు 80 శాతం మంది విద్యార్థులు
భారత్లో జరుగుతున్న పరిణామాలను సోషల్ మీడియా ద్వారా చూస్తున్న ప్రవాస భారతీయులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామని భావించారని నిర్వాహకులు తెలిపారు.
అందుకే సంఘీభావంగా ఈ నిరసనలకు పిలుపునిచ్చామని నిర్వాహకులు తెలిపారు.
స్వదేశంలో విద్యార్థులు, యువతపై జరుగుతున్న చర్యలు తమను తీవ్రంగా కలిచివేశాయని పేర్కొన్నారు.
ఈ నిరసనల్లో సుమారు 80 శాతం మంది విద్యార్థులు కాగా, మిగిలిన వారు వివిధ రంగాల్లో పనిచేస్తున్న భారతీయ నిపుణులని నిర్వాహకులు వెల్లడించారు.