LPG: హర్మూజ్ దాటి భారత్ దిశగా నౌకలు.. వంటగ్యాస్ సరఫరాకు ఊరట
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ఇంధన కొరతపై ఆందోళనలు నెలకొన్న సమయంలో భారత్కు చెందిన కొన్ని నౌకలు క్రమంగా హర్మూజ్ జలసంధిని దాటుతుండటం కొంత ఊరటనిస్తోంది. తాజాగా రెండు ఎల్పీజీ నౌకలు సురక్షితంగా హర్మూజ్ దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాయి. IRGC అనుమతితో ప్రయాణం ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అనుమతి అనంతరం 'జగ్ వసంత్', 'పైన్ గ్యాస్' పేరుతో ఉన్న రెండు ఎల్పీజీ నౌకలు సోమవారం ఉదయం హర్మూజ్ జలసంధిని దాటాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ నౌకలు అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్నాయి. త్వరలోనే దేశీయ పోర్టులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో దేశంలో వంటగ్యాస్ సరఫరా కొంతవరకు మెరుగుపడే అవకాశం కనిపిస్తోంది.
vivaralu
ఉద్రిక్తతల మధ్య నిలిచిపోయిన నౌకలు
ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా భారత్కు చెందిన పలు నౌకలు కొన్ని రోజుల పాటు అక్కడే నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత నౌకలు సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటేలా కేంద్ర ప్రభుత్వం ఇరాన్ అధికారులతో నిరంతరం చర్చలు జరిపింది. ఆ ప్రయత్నాల ఫలితంగా గత కొన్ని రోజులుగా నౌకలు ఒక్కొక్కటిగా ప్రయాణం ప్రారంభించి దేశీయ పోర్టులకు చేరుకుంటున్నాయి. అనుమతుల్లో ఆలస్యం.. కారణాలేమిటి? ఇరాన్లో జరిగిన పరిణామాలు కూడా నౌకల ప్రయాణంపై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ దేశ సీనియర్ నేత అలీ లారిజానీ మరణం, ఇరాన్ చమురు క్షేత్రాలపై అమెరికా దాడులు వంటి అంశాల కారణంగా అనుమతులు ఆలస్యమవుతున్నట్లు సమాచారం.