Loading...
Burj Khalifa: భారత పర్యాటకులకు శుభవార్త.. యూపీఐతో బుర్జ్ ఖలీఫా టికెట్లు
భారత పర్యాటకులకు శుభవార్త.. యూపీఐతో బుర్జ్ ఖలీఫా టికెట్లు

Burj Khalifa: భారత పర్యాటకులకు శుభవార్త.. యూపీఐతో బుర్జ్ ఖలీఫా టికెట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2026
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ పర్యాటకులకు మరో శుభవార్త అందింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాను సందర్శించాలనుకునే వారు ఇకపై యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా ఆన్‌లైన్‌లోనే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం పొందారు. దీంతో యూఏఈలో ఈ-కామర్స్ లావాదేవీల కోసం యూపీఐ చెల్లింపులను స్వీకరిస్తున్న తొలి సంస్థగా బుర్జ్ ఖలీఫా నిలిచింది. ఈ కొత్త సేవలను ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్‌), నియోపే (NEOPAY), ఈమార్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ప్రారంభించాయి. ఈ భాగస్వామ్యంతో భారతీయులు యూఏఈకి వెళ్లే ముందే బుర్జ్ ఖలీఫా అధికారిక వెబ్‌సైట్‌లో తమకు నచ్చిన యూపీఐ యాప్‌ను ఉపయోగించి సులభంగా టికెట్లు కొనుగోలు చేయవచ్చు.

వివరాలు 

ఎన్‌పీసీఐ, నియోపే, ఈమార్‌ల భాగస్వామ్యంతో అమలు

యూఏఈలో క్యూఆర్ కోడ్ ఆధారిత యూపీఐ చెల్లింపులు ఇప్పటికే 2022లో అందుబాటులోకి వచ్చాయి.

అప్పటి నుంచి నియోపే నెట్‌వర్క్‌లోని వ్యాపార సంస్థల్లో భారతీయ పర్యాటకులు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు.

తాజాగా ఈ సేవలను మరింత విస్తరించి, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రితేశ్ శుక్లా మాట్లాడుతూ.. విదేశాలకు వెళ్లే భారతీయులు తమకు ఇప్పటికే అలవాటైన, సురక్షితమైన చెల్లింపు విధానాన్నే ఉపయోగించాలని కోరుకుంటారని తెలిపారు.

ఈ సదుపాయంతో యూఏఈ చేరుకునే ముందే యూపీఐ ద్వారా బుర్జ్ ఖలీఫా టికెట్లు సులభంగా బుక్ చేసుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.

వివరాలు 

బుకింగ్ ప్రక్రియ మరింత వేగంగా, సులభంగా

నియోపే సీఈఓ విభోర్ ముంధాడా మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాల్లో ఈ-కామర్స్ లావాదేవీల కోసం యూపీఐ సేవలను ప్రారంభించిన తొలి సంస్థగా నియోపే నిలిచిందని చెప్పారు.

భారతీయ వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన డిజిటల్ చెల్లింపు అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని వెల్లడించారు.

ఈమార్ ప్రతినిధి మాట్లాడుతూ.. బుర్జ్ ఖలీఫాను సందర్శించే అంతర్జాతీయ పర్యాటకుల్లో భారతీయులే ప్రధాన వాటా కలిగి ఉన్నారని తెలిపారు.

యూపీఐ ఆధారిత ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి రావడంతో భారతీయ సందర్శకులకు బుకింగ్ ప్రక్రియ మరింత వేగంగా, సులభంగా మారుతుందని పేర్కొన్నారు.

ADVERTISEMENT