Operation Sindoor: ఉగ్రవాదంపై భారత్ కఠిన వైఖరికి ప్రతిబింబం 'సిందూర్': ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్ తీసుకున్న దృఢ నిర్ణయాలు, దేశ భద్రత పరిరక్షణలో మన నిబద్ధతను 'ఆపరేషన్ సిందూర్' స్పష్టంగా చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఆపరేషన్కు ఏడాది పూర్తైన సందర్భంగా ఆయన 'ఎక్స్' వేదికగా స్పందించారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో భారత్ ఎప్పటికీ వెనుకడుగు వేయదని మరోసారి స్పష్టం చేశారు. ఏడాది క్రితం ఇదే రోజున మన సాయుధ దళాలు అపార ధైర్యం, అచంచల సంకల్పం, అత్యంత కచ్చితత్వంతో 'ఆపరేషన్ సిందూర్'ను విజయవంతంగా నిర్వహించాయని మోదీ పేర్కొన్నారు. పహల్గాంలో అమాయక భారతీయుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులకు ఈ ఆపరేషన్ గట్టి సమాధానంగా నిలిచిందన్నారు. సైన్యం ప్రదర్శించిన శౌర్యం, పరాక్రమం దేశానికి గర్వకారణమని తెలిపారు.
వివరాలు
దేశ భద్రతకు మరింత బలం
ఈ చర్య ద్వారా ఉగ్రవాదంపై భారత్ తీసుకున్న కఠిన వైఖరి మరింత బలంగా ప్రతిబింబించిందని ఆయన అన్నారు. దేశ భద్రతను కాపాడడంలో మన దళాల నిబద్ధత, సిద్ధత, సామర్థ్యం, సంకల్పబలం ఎంత ఉన్నతంగా ఉందో 'సిందూర్' ద్వారా ప్రపంచానికి తెలియజేసినట్టు పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన కోసం చేపట్టిన చర్యలు ఫలితాలు ఇస్తున్నాయని, దేశ భద్రతకు మరింత బలం చేకూరుతోందని వివరించారు.
వివరాలు
ఉగ్రవాదులు, వారికి తోడ్పడే శక్తులపై కఠిన చర్యలు
ఉగ్రవాదులు, వారికి తోడ్పడే శక్తులపై కఠిన చర్యలు కొనసాగుతాయని మోదీ హెచ్చరించారు. ఇక 'ఆపరేషన్ సిందూర్' విజయానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం కొత్త లోగోను రూపొందించింది. గతంలో విడుదల చేసిన లోగోకు అదనంగా, దాని పైభాగంలో సగర్వంగా రెపరెపలాడుతున్న భారత మువ్వన్నెల పతాకాన్ని చేర్చారు. ఈ లోగో చిత్రాన్ని ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో ప్రొఫైల్ చిత్రంగా పెట్టుకున్నారు.