 
                                                                                Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఆయుర్వేద దగ్గు సిరప్ తాగి.. ఆరు నెలల శిశువు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
చింద్వారా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోహి మినోటే అనే ఆరు నెలల చిన్నారి, ఆయుర్వేద దగ్గు సిరప్ తాగిన కొద్ది గంటలకే మృతి చెందింది. జలుబు, జ్వరం వచ్చిన నేపథ్యంలో కుటుంబసభ్యులు డాక్టర్ని సంప్రదించకుండా స్థానిక మెడికల్ షాపులోని ఆయుర్వేద సిరప్ కొనుగోలు చేసి ఇచ్చారని సమాచారం. మొదట చిన్నారికి జ్వరం తగ్గినట్లు అనిపించినా, నాలుగు రోజుల తర్వాత పరిస్థితి విషమించడంతో పాపాను సివిల్ ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతుండగానే వైద్యులు చిన్నారి మృతి చెందినట్లుగా ప్రకటించారు.
విచారణ జరుగుతోంది
ఆసుపత్రి సిబ్బందిపై కుటుంబం ఆరోపణలు
రోహి కుటుంబ సభ్యులు ఈ ఘటనపై తీవ్ర ఆరోపణలు చేశారు. సిరప్ వల్లే పరిస్థితి క్షీణించిందని, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా పరిపాలన మూడు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో డ్రగ్ ఇన్స్పెక్టర్, బ్లాక్ మెడికల్ ఆఫీసర్, మరో అధికారి ఉన్నారు. "పోస్ట్మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం. అందులో వచ్చిన వివరాల ఆధారంగా తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని ఒక ఉన్నతాధికారి తెలిపారు.
షాప్ సీజ్
ప్రజల్లో ఆందోళన - మెడికల్ షాప్ సీజ్
ఈ ఘటనతో చింద్వారాలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. జాగ్రత్త చర్యగా ఆ సిరప్ అమ్మిన మెడికల్ షాప్ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. గతంలో కూడా ఇదే జిల్లాలో విషతుల్యమైన దగ్గు సిరప్ వల్ల ఐదేళ్ల లోపు 24 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తాజాగానే గుర్తు చేస్తోంది. ఆ సంఘటన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) భారత్లో తయారైన Coldrif, Respifresh TR, ReLife అనే మూడు సిరపులపై ప్రపంచవ్యాప్తంగా హెచ్చరిక జారీ చేసింది.
అరెస్టు
తయారీ సంస్థ లైసెన్స్ రద్దు - ఆరుగురు అరెస్ట్
ఈ ఘటనల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం స్రేసన్ ఫార్మా అనే కంపెనీ తయారీ లైసెన్స్ను రద్దు చేసింది. అదే సమయంలో మధ్యప్రదేశ్ పోలీసులు ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. అందులో స్రేసన్ ఫార్మా యజమాని జీ. రంగనాథన్, చింద్వారాకు చెందిన డాక్టర్ ప్రవీణ్ సోని ఉన్నారు. అలాగే కెమిస్ట్ కె. మహేశ్వరి, హోల్సేలర్ రాజేష్ సోని, ఫార్మసిస్ట్ సౌరభ్ జైన్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.