LOADING...
Iran: ఉద్యోగ మోసం,దోపిడీలు,కిడ్నాప్‌ల బారిన పడొద్దు..ఇరాన్‌కు వెళ్లే భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
ఇరాన్‌కు వెళ్లే భారతీయులకు కేంద్రం అడ్వైజరీ

Iran: ఉద్యోగ మోసం,దోపిడీలు,కిడ్నాప్‌ల బారిన పడొద్దు..ఇరాన్‌కు వెళ్లే భారతీయులకు కేంద్రం అడ్వైజరీ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 18, 2025
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌ నవంబర్‌ 22 నుంచి భారతీయులకు వీసా లేకుండా ప్రయాణించే సౌకర్యాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తమ పౌరులకు జాగ్రత్తలు సూచిస్తూ ఒక అడ్వైజరీ విడుదల చేసింది. ఇరాన్‌కు వెళ్లాలనుకునే వారు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, దోపిడీలు లేదా కిడ్నాప్‌లకు గురికాకుండా జాగ్రత్త పడాలని విదేశాంగశాఖ హెచ్చరించింది. ఉపాధి కల్పిస్తామంటూ తప్పుడు హామీలు ఇస్తూ, ఇరాన్‌ నుంచి ఇతర దేశాలకు పంపిస్తామంటూ చెప్పే ఏజెంట్లను అసలు నమ్మవద్దని కేంద్రం స్పష్టం చేసింది. ఇలాంటి వ్యక్తులు నేరగాళ్ల గుంపులతో కలిసి పనిచేసే అవకాశముండటంతో, వారి ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

వివరాలు 

 ఈ నెల 22 నుంచి అమల్లోకి.. 

సాధారణ భారత పౌరులు వీసా లేకుండా ఇరాన్‌లో ప్రయాణించే అవకాశాన్ని నిలిపే నిర్ణయం ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తుందని ఆ దేశ విదేశాంగ శాఖ సోమవారం ప్రకటించింది. భారతీయులను తప్పుడు ఉద్యోగ హామీలతో ఇరాన్‌కు రప్పిస్తున్నారన్న వార్తలు వెలుగులోకి రావడంతో ఈ చర్య తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. అదికాక, ఇతర దేశాలకు పంపేముందు భారతీయులను తాత్కాలికంగా ఇరాన్‌కు తరలిస్తున్నారన్న సమాచారం కూడా ఈ నిర్ణయానికి కారణమైందని తెలిపింది. నేర ముఠాలు ఈ సదుపాయాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే వీసా రహిత ప్రయాణాన్ని రద్దు చేస్తున్నట్లు ఇరాన్‌ ప్రభుత్వం పేర్కొంది.

వివరాలు 

భారతీయ పర్యాటకులు 15 రోజులపాటు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించడానికి అనుమతి

2023లో ఇరాన్‌ భారత పర్యాటకులు 15 రోజులపాటు వీసా లేకుండానే తమ దేశాన్ని సందర్శించేందుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత భారతీయులు వీసా అవసరం లేకుండానే ఇరాన్‌కు వెళ్తున్నారు. అయితే తాజాగా ఆ సౌకర్యాన్ని నిలిపివేయడంతో, ఇకపై ఇరాన్‌కు వెళ్లే భారతీయులు ముందుగానే వీసా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.