#NewsBytesExplainer: ఏపీలో వివాదాలు తలెత్తకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు సాధ్యమేనా ?
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేయడమే కాకుండా, వాటి పేర్ల మార్పులు, సరిహద్దుల సవరణల తుది ప్రతిపాదనలను సిద్ధం చేయడానికి ముందడుగు వేస్తోంది. ఈ విషయాలపై మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన చర్చించనుంది. ముఖ్యమంత్రి సూచనలతో తుది నివేదికను సిద్ధం చేసి, నవంబర్ 7న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు. జనగణన కారణంగా ఈ ప్రక్రియను డిసెంబర్ 31లోగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.
వివరాలు
ఎన్నికల హామీల అమలు దిశగా టీడీపీ
ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలలో భాగంగా మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుపై ప్రతిపాదన సిద్ధమవుతోంది. ఈ కొత్త జిల్లాలో కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం నియోజకవర్గాలు చేర్చే అవకాశముంది. అదేవిధంగా అద్దంకి నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చాలని స్థానిక ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. అలాగే, రంపచోడవరం, చింతూరు డివిజన్లు మరియు నాలుగు విలీన మండలాలను కలిపి ఏజెన్సీ ప్రాంతంలో కొత్త జిల్లా ఏర్పాటుకు కూడా ప్రభుత్వం యోచిస్తోంది. రంపచోడవరం నుంచి ప్రస్తుత జిల్లా కేంద్రం పాడేరు దూరం 187 కిలోమీటర్లు కావడంతో, అక్కడి ప్రజలకు సౌకర్యం కోసం కొత్త జిల్లా ఏర్పాటు అవసరమని టీడీపీ ఎన్నికల సమయంలో ప్రకటించింది.
వివరాలు
అమరావతి కేంద్రంగా జిల్లా
పల్నాడు,ఎన్టీఆర్,గుంటూరు జిల్లాల కొంత భాగాన్ని కలిపి అమరావతి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశం పరిశీలనలో ఉంది. రాష్ట్ర రాజధానిగా ఉండటంతో, భద్రతా వ్యవహారాలు,ప్రోటోకాల్ విధులు,ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాల్లో పరిపాలనా సౌలభ్యం కోసం అమరావతిని జిల్లాగా చేయాలని సూచనలు వస్తున్నాయి. ఇక మదనపల్లెను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలా అనే అంశంపైన కూడా నివేదికలో వివరాలు ఉండనున్నాయి. అంతేకాదు,అద్దంకి, మడకశిరతో పాటు పది కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. ఒక నియోజకవర్గం రెండు లేదా మూడు డివిజన్ల మధ్య విభజించబడి ఉంటే, పరిపాలనా సౌలభ్యం కోసం ఒకే నియోజకవర్గ పరిధిలోకి తీసుకురావాలనే ప్రణాళిక ఉంది. కొన్ని మండలాల విభజన పై కూడా సూచనలు వెలువడ్డాయి.
వివరాలు
వివాదాలు లేకుండా పూర్తి చేయగలరా?
ఈ ప్రక్రియలో ఏడు మంది మంత్రులతో కూడిన ఉపసంఘంను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాలు,డివిజన్లు,మండలాలు,గ్రామ సరిహద్దులు,పేర్ల మార్పులపై ఈ ఉపసంఘం పరిశీలిస్తోంది. మొదటి సమావేశం ఆగస్టు 13న సచివాలయంలో జరిగింది.రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు ప్రజా సంఘాలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఇప్పటివరకు మంత్రులు,ప్రజా ప్రతినిధుల నుంచి దాదాపు 200 అర్జీలు అందాయి. మూడు రోజుల క్రితం జరిగిన సమావేశంలో వాటిపై చర్చించి,జిల్లా అధికారుల అభిప్రాయాలు సేకరించారు.
వివరాలు
వివాదాలు లేకుండా పూర్తి చేయగలరా?
అయితే, ఏ నిర్ణయం తీసుకున్నా కొంతమంది రాజకీయ నాయకులు లేదా వర్గాలు వివాదం రేపే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పేర్ల మార్పుల అంశం బయటకు వస్తే, గతంలోలాగే సోషల్ మీడియాలో పెద్ద చర్చలు, వాదోపవాదాలు తలెత్తే అవకాశముంది. అ పూర్తి ప్రతిపాదనలు వెలుగులోకి వస్తే అసలు రాజకీయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.