Page Loader
Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి! 
వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!

Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి! 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 18, 2025
03:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన హర్యానా యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారత్‌లో నివసిస్తూ శత్రు దేశానికి సున్నితమైన సమాచారాన్ని చేరవేసినందుకు ఆమెపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం 5 రోజుల పోలీసు కస్టడీలో ఉన్న ఆమెపై విచారణ కొనసాగుతోంది.

Details

 పాక్ ఎంబసీ 'ఇఫ్తార్' విందులో హాజరు

దిల్లీలోని పాక్ ఎంబసీలో పనిచేస్తున్న డానిష్ అనే అధికారి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జ్యోతి మల్హోత్రా పాల్గొన్న విషయాలు ఆమె యూట్యూబ్ వీడియోల ద్వారా బయటపడ్డాయి. విందు ఏర్పాట్లను ఆమె 'సూపర్‌గా, డూపర్‌గా' అంటూ కొనియాడినట్టు వీడియోల్లో ఉంది. ఈ సందర్భంగా పాక్ జాతీయ దినోత్సవం, పాక్ పర్యటనల గురించి ఆమె ఇతరులతో సంభాషించినట్లుగా పోలీసులు గుర్తించారు. "పాకిస్థాన్‌కి వెళ్లాలని ఉంది" అని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.

Details

4కంటే ఎక్కువసార్లు పాక్ పర్యటనలు

ఆధికారిక వర్గాల ప్రకారం, డానిష్ సహకారంతో జ్యోతి మల్హోత్రా పాక్‌కు కనీసం నాలుగు సార్లు పైగా వెళ్లింది. ఈ పర్యటనల వివరాలు ఆమె యూట్యూబ్‌ ఛానెల్‌ వీడియోలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో 'పాకిస్తాన్‌లో భారత అమ్మాయి', 'లాహోర్‌ను అన్వేషిస్తున్న భారత అమ్మాయి', కటాస్ రాజ్ ఆలయంలో భారత అమ్మాయి, 'లగ్జరీ బస్సును నడిపిన భారత అమ్మాయి వంటి శీర్షికలతో వీడియోలు ఉన్నాయి. పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె మరియం నవాజ్‌ను కలిసిన వీడియో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో లభ్యమైంది

Details

నిఘా వర్గాలతో సంబంధాలు

పోలీసుల విచారణలో ఆమె పాక్‌ నిఘా సంస్థల అధికారులతో టచ్‌లో ఉన్నట్లు తేలింది. వాట్సాప్‌, టెలిగ్రామ్‌, స్నాప్‌చాట్‌ వంటివి ఉపయోగించి భారత ఆర్మీకి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసినట్లు వెల్లడించారు. ఆమె శ్రీనగర్ సహా వివిధ సున్నిత ప్రాంతాల్లో పర్యటించిన నేపథ్యంలో పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. హర్యానాలో మరికొంతమంది అరెస్టు జ్యోతి మల్హోత్రాతో పాటు గూఢచర్య ఆరోపణలపై హర్యానాలో మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ఐఎస్‌ఐతో సంబంధాలు కలిగి శత్రు దేశానికి సమాచారం అందించినట్లు నమ్ముతున్నారు. వీరిని హరియాణాలోని వివిధ ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్నారు.

Details

ట్రావెల్ బ్లాగర్‌ నుంచి నిందితురాలిగా

జ్యోతి మల్హోత్రా హరియాణాలోని హిసార్‌కు చెందిన ట్రావెల్ బ్లాగర్‌. దిల్లీలో నివసిస్తూ యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రాచుర్యం పొందిన ఆమెకు యూట్యూబ్‌లో 3.7 లక్షల సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. ఆమె 2023లో పాకిస్థాన్ వెళ్లిన బృందంలో భాగమై అక్కడ డానిష్‌ను కలిసినట్లు విచారణలో వెల్లడైంది. ఇండోనేషియా కూడా ఆమె పర్యటించినట్లు అధికారులు తెలిపారు.

Details

డానిష్ సూచనతో భారత కాంటాక్టులతో టచ్

భారతదేశానికి వచ్చిన తర్వాత డానిష్ సూచన మేరకు ఆమె 'అహ్వాన్‌' అనే వ్యక్తిని కలిశారు. అతడు పాక్‌ నిఘా, రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులతో ఆమెను పరిచయం చేశాడు. ఇతరుల కంటపడకుండా ఉండేందుకు ఆమె తమ కాంటాక్టుల పేర్లను ఫోన్‌లో వేరే పేర్లతో సేవ్ చేసిందని అధికారులు తెలిపారు. అధికారిక గూఢచర్య ఆరోపణలు జ్యోతి మల్హోత్రా తీరుపై అధికారులు తీవ్రమైన ఆరా తీస్తున్నారు. ఆమె ఫోన్, ల్యాప్‌టాప్, బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ఆమెపై 'ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్' కింద కేసు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న పాక్ ఎంబసీ అధికారి డానిష్‌ను భారత్‌ ఈ నెల 13న బహిష్కరించింది.