Loading...
Independence Day: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఉగ్ర ముప్పు.. పాక్, బంగ్లా సరిహద్దుల్లో హైఅలర్ట్
పాక్, బంగ్లా సరిహద్దుల్లో హైఅలర్ట్

Independence Day: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఉగ్ర ముప్పు.. పాక్, బంగ్లా సరిహద్దుల్లో హైఅలర్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2026
01:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న వేళ దేశంలో ఉగ్రవాద దాడుల ముప్పు ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ అండతో ఉగ్రవాదులు సరిహద్దు ప్రాంతాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో దాడులకు ప్రయత్నించే అవకాశం ఉందన్న సమాచారంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో ఉన్న సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసింది.

వివరాలు 

వేడుకలే లక్ష్యంగా దాడులకు కుట్ర?

ఆగస్టు 15న ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ సహా కీలక ప్రాంతాల్లో భద్రతా బలగాల ప్రధాన దృష్టి స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలపైనే ఉంటుంది.

ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని దాడులకు పాల్పడేందుకు ఐఎస్ఐ ప్రయత్నించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి ఒకరు వెల్లడించారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే), బలూచిస్థాన్‌లో కొనసాగుతున్న అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కూడా ఇలాంటి కుట్రలకు ఐఎస్ఐ పాల్పడుతోందని నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి.

వివరాలు 

చొరబాట్లపై ప్రత్యేక నిఘా

జమ్మూ కాశ్మీర్‌లోకి ఉగ్రవాదులను అక్రమంగా చొరబెట్టే ప్రయత్నాలతో పాటు బంగ్లాదేశ్ సరిహద్దుల మీదుగా ఉగ్రవాదులను దేశంలోకి పంపించే అవకాశం ఉందని భద్రతా సంస్థలకు హెచ్చరికలు అందాయి.

అంతేకాకుండా భద్రతా ఏర్పాట్లు తక్కువగా ఉండే టైర్-2 నగరాలను కూడా ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు.

భద్రతా సంస్థలను తప్పుదోవ పట్టించేందుకు ఐఎస్ఐ మరో వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.

ఢిల్లీ లేదా కశ్మీర్‌లో దాడులు జరగబోతున్నాయంటూ ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి, భద్రతా బలగాల దృష్టిని అటువైపు మళ్లించవచ్చు.

అనంతరం భద్రత తక్కువగా ఉన్న మరో ప్రాంతంలో దాడికి ప్రయత్నించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

పాక్ సరిహద్దులో 'ఆపరేషన్ అలర్ట్'

నిఘా హెచ్చరికల నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఉన్న పశ్చిమ సరిహద్దులో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) 'ఆపరేషన్ అలర్ట్'ను ప్రారంభించింది.

ఆగస్టు 10 నుంచి 17వ తేదీ వరకు ఈ ఆపరేషన్ కొనసాగనుంది.

ఇందులో భాగంగా బీఎస్ఎఫ్ సీనియర్ అధికారులు భద్రతా పరిస్థితులను నేరుగా పర్యవేక్షిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా, గస్తీని గణనీయంగా పెంచారు.

మరోవైపు బంగ్లాదేశ్‌తో ఉన్న సరిహద్దులో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

ADVERTISEMENT

వివరాలు 

బంగ్లా సరిహద్దులో ఎస్ఐబీ యూనిట్లు

పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు జిల్లాల్లో సుమారు 40 సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

బంగ్లాదేశ్ సరిహద్దు అత్యంత సున్నితమైన ప్రాంతంగా ఉండటంతో అక్కడ శాశ్వత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ చర్యలు చేపడుతోంది.

సరిహద్దుల ద్వారా జరిగే చొరబాట్లు, స్మగ్లింగ్ వంటి అక్రమ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గుర్తించి అడ్డుకునేందుకు ఈ నిఘా వ్యవస్థను ఉపయోగించనున్నారు.

ADVERTISEMENT