LOADING...
Interpol: కశ్మీర్ వైద్యుడిపై రెడ్ కార్నర్ నోటీసు.. ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన పోలీసులు
కశ్మీర్ వైద్యుడిపై రెడ్ కార్నర్ నోటీసు.. ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన పోలీసులు

Interpol: కశ్మీర్ వైద్యుడిపై రెడ్ కార్నర్ నోటీసు.. ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన పోలీసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2025
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన (Delhi Blast)తో సంబంధం ఉన్న ఫరీదాబాద్‌ ఉగ్ర మాడ్యూల్‌ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్‌లోని కాజీగుండ్‌కు చెందిన డాక్టర్‌ ముజఫ్ఫర్‌పై రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ (INTERPOL)ను భారత్‌ అభ్యర్థించింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు వైద్యులు సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన వారిలో డాక్టర్‌ ఆదిల్‌ ఒకరు కాగా, డాక్టర్‌ ముజఫ్ఫర్‌ ఆయన సోదరుడు. నిందితుల విచారణలో ముజఫ్ఫర్‌ పేరు బయటపడింది. 2021లో తుర్కియే పర్యటనకు వెళ్లిన డాక్టర్‌ ముజమ్మిల్‌, డాక్టర్‌ ఉమర్‌ నబీతో పాటు డాక్టర్‌ ముజఫ్ఫర్‌ కూడా ఆ బృందంలో భాగమని విచారణలో వెల్లడైంది.

వివరాలు 

ముజఫ్ఫర్‌ ఆచూకీ కోసం పోలీసులు యత్నం 

ఆ బృందం తుర్కియేలో సుమారు 21 రోజులపాటు గడిపిందని తెలిసింది. దిల్లీ ఎర్రకోట వద్ద పేలుడుకు కారణమైన కారు నడిపింది డాక్టర్‌ ఉమర్‌ నబీ అని అధికారులు సీసీటీవీ దృశ్యాలు, అలాగే డీఎన్‌ఏ నమూనాల సరిపోలిక ద్వారా నిర్ధారించినట్లు జాతీయ మీడియా నివేదికలు వెల్లడించాయి. ముజఫ్ఫర్‌ పేరు బయటకు రాగానే అతడి ఆచూకీ కోసం పోలీసులు యత్నించారు. దర్యాప్తులో అతడు ఆగస్టులోనే దుబాయికి పారిపోయినట్లు సమాచారం లభించింది. ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లో తలదాచుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అందువల్ల అతడిని అంతర్జాతీయంగా గుర్తించేందుకు ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేయాలని నిర్ణయించారు.

వివరాలు 

ఖండించిన తుర్కియే ప్రభుత్వం

ఇదిలా ఉండగా, ఈ కేసులో తుర్కియే పేరు ప్రస్తావన రావడంపై ఆ దేశం తీవ్రంగా స్పందించింది. తమ దేశం భారతదేశం లేదా మరే ఇతర దేశంపై ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలను తప్పుడు, ఆధారరహితమైనవి అని తుర్కియే ప్రభుత్వం ఖండించింది.