YSRCP: జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం.. వైసీపీ కార్యకర్తలపై కేసులు
ఈ వార్తాకథనం ఏంటి
ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న జంతుబలి ఘటనలపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. వైసీపీ అధినేత జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని, బహిరంగ ప్రదేశాల్లో వేట కొడవళ్లతో జంతువులను బలిచేస్తూ ప్రజల్లో భయాందోళనలకు దారితీసిన వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. రాప్తాడు నియోజకవర్గంలోని భానుకోటతో పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం ప్రాంతాల్లో వేట కొడవళ్లతో పొట్టేళ్లను బలిచేసి హంగామా చేసిన ఘటనలను పోలీసులు గుర్తించారు. ఈ చర్యలు రాజకీయ ఉద్రిక్తతలను పెంచే విధంగా ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు.
వివరాలు
రాప్తాడు నియోజకవర్గం భానుకోట, కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రంలో ఘటనలు
ఈ ఘటనలపై అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు చర్యలకు దిగారు. నిందితులకు పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ నిర్వహించారు. బ్రహ్మసముద్రంలో జంతుబలి చేసిన వారిని నడిరోడ్డుపై ఊరేగిస్తూ హెచ్చరికలు జారీ చేయగా, భానుకోటలోనూ ఇదే విధమైన కౌన్సిలింగ్ ఇచ్చారు. జంతు సంక్షేమ చట్టాలు సహా పలు చట్ట విభాగాల కింద నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇకపై ఇలాంటి ఘటనలు తిరగబెట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లావ్యాప్తంగా పటిష్టమైన నిఘా కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.