
Jagan Mohan Reddy: జగన్ ఆస్తుల వివాదంలో కీలక పరిణామం.. హైదరాబాద్ ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులపై స్టే
ఈ వార్తాకథనం ఏంటి
చెన్నైలోని జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ముందు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతికూల పరిణామం ఎదురైంది. జగన్, ఆయన భార్య వై. భారతి, తల్లి వై. విజయమ్మ పేర్లపై నమోదు చేసిన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్ల వివాదంపై ఎన్సీఎల్ఏటీ చెన్నై బెంచ్ కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వుల ప్రకారం,వై.ఎస్. విజయమ్మకు ఉన్న 99.75 శాతం వాటా కొనసాగించాలి, అయితే వాటాల బదిలీ లేదా యాజమాన్యం మార్పు వంటి చర్యలకు ఇరు పక్షాలు వెళ్లరాదని స్పష్టం చేసింది.
వివరాలు
ఎన్సీఎల్టీ తీర్పుపై సవాల్
అలాగే,రిజిస్టర్లో షేర్ల వివరాల సవరణపై ఎన్సీఎల్టీ ఇచ్చిన ఆదేశాల అమలులో కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టబోమని జగన్, భారతి తరఫు న్యాయవాది ఇచ్చిన హామీని ట్రైబ్యునల్ రికార్డు చేసింది. ఇటీవలి హైదరాబాద్ ఎన్సీఎల్టీ బెంచ్ జగన్ కుటుంబానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో కంపెనీ షేర్ల బదిలీ చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ, జగన్, భారతి, విజయమ్మ షేర్హోల్డర్ హక్కులను పునరుద్ధరించాలనే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ నిర్ణయాన్ని సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీతో పాటు వై.ఎస్. విజయమ్మ కూడా సవాలు చేస్తూ, చెన్నై ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించారు.
వివరాలు
మధ్యంతర ఉత్తర్వులతో స్టేటస్ కో
విచారణ అనంతరం చెన్నై ఎన్సీఎల్ఏటీ బెంచ్ "ప్రస్తుత స్థితిని అలాగే కొనసాగించాలి" అని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. "తదుపరి విచారణ వరకు ఇరు పక్షాలు షేర్హోల్డర్ హక్కులను వినియోగించకూడదు" అని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల ఫలితంగా ప్రస్తుతం జగన్ కుటుంబానికి ఉన్న షేరుహోల్డర్ హక్కులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.