Loading...
West Bengal: 'LMN 10' కోడ్‌తో జైష్‌ ఉగ్రవాది కమ్యూనికేషన్‌.. బెంగాల్‌ STF ఛేదించిన రహస్యాలు!
'LMN 10' కోడ్‌తో జైష్‌ ఉగ్రవాది కమ్యూనికేషన్‌.. బెంగాల్‌ STF ఛేదించిన రహస్యాలు!

West Bengal: 'LMN 10' కోడ్‌తో జైష్‌ ఉగ్రవాది కమ్యూనికేషన్‌.. బెంగాల్‌ STF ఛేదించిన రహస్యాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2026
04:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లోని బర్ద్వాన్‌లో ఇటీవల అరెస్టైన జైష్‌-ఏ-మహ్మద్‌ (JeM) అనుమానిత ఉగ్రవాది 'హమీమ్‌ మొండాల్‌' పాకిస్థాన్‌లోని తన హ్యాండ్లర్లతో ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజింగ్‌ యాప్‌ల ద్వారా రహస్యంగా సంప్రదింపులు జరిపినట్లు బెంగాల్‌ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ (STF) దర్యాప్తులో వెల్లడైంది. డబ్బు, వ్యక్తుల రవాణాకు సంబంధించిన సమాచారాన్ని కోడ్‌ పదాలతో మార్పిడి చేసినట్లు అధికారులు గుర్తించారు. గత గురువారం బర్ద్వాన్‌లోని గేటెడ్‌ టౌన్‌షిప్‌లో ఉన్న 'రెనైసాన్స్‌ ఫిట్‌నెస్‌ స్టూడియో' జిమ్‌లో హమీమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో అతడు జైష్‌ ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధాలు కలిగి ఉండటంతో పాటు, పాకిస్థాన్‌కు చెందిన భట్టి-గుజ్జర్‌ గ్యాంగ్‌తో నేరుగా పనిచేసినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి.

వివరాలు

పాకిస్థాన్‌ హ్యాండ్లర్లతో సంబంధాలు

దర్యాప్తు ప్రకారం, హమీమ్‌ మొదట 'Element X' అనే ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా పాకిస్థాన్‌ హ్యాండ్లర్లతో సంబంధాలు కొనసాగించాడు.

అయితే 2023 మేలో కేంద్ర ప్రభుత్వం సమాచార సాంకేతిక చట్టంలోని 'సెక్షన్‌ 69ఏ' కింద Element X సహా 14 ఎన్‌క్రిప్టెడ్‌ యాప్‌లను నిషేధించడంతో, అతడు 'Session' అనే మరో ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ యాప్‌కు మారినట్లు అధికారులు తెలిపారు.

నిఘా సంస్థల కళ్లకు చిక్కకుండా ఉండేందుకు హమీమ్‌ LMN 10, How's the Josh వంటి కోడ్‌ పదాలను ఉపయోగించి తన హ్యాండ్లర్లతో సమాచార మార్పిడి చేసినట్లు STF వెల్లడించింది.

వివరాలు

లోతుగా దర్యాప్తు చేస్తున్న అధికారులు

దర్యాప్తులో మరో కీలక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. హమీమ్‌ ప్రేయసిని కూడా ఉగ్ర నెట్‌వర్క్‌లో భాగంగా గూఢచర్య కార్యకలాపాలు నిర్వహించేలా సిద్ధం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆమెను శనివారం జార్ఖండ్‌లో అరెస్టు చేశారు.

అధికారుల వివరాల ప్రకారం, హమీమ్‌ పాకిస్థాన్‌ ఐఎస్ఐ మద్దతు ఉన్న షహజాద్‌ భట్టి గ్యాంగ్‌కు పనిచేసేవాడు.

ప్రారంభంలో ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వంటి సాధారణ సోషల్‌ మీడియా, మెసేజింగ్‌ వేదికలను ఉపయోగించిన అతడు, తర్వాత నిఘా సంస్థల పర్యవేక్షణ నుంచి తప్పించుకునేందుకు మరింత భద్రత కలిగిన ఎన్‌క్రిప్టెడ్‌ ప్లాట్‌ఫామ్‌లను ఆశ్రయించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఈ వ్యవహారంపై బెంగాల్‌ STFతో పాటు ఇతర కేంద్ర నిఘా సంస్థలు కూడా లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

ADVERTISEMENT