Page Loader
Operation Sindoor: భారత్‌లోకి ప్రవేశించేందుకు ముష్కరుల ప్రయత్నాలు.. అడ్డుకొన్న బీఎస్‌ఎఫ్‌.. ఏడుగురు హతం
భారత్‌లోకి ప్రవేశించేందుకు ముష్కరుల ప్రయత్నాలు.. ఏడుగురు హతం

Operation Sindoor: భారత్‌లోకి ప్రవేశించేందుకు ముష్కరుల ప్రయత్నాలు.. అడ్డుకొన్న బీఎస్‌ఎఫ్‌.. ఏడుగురు హతం

వ్రాసిన వారు Sirish Praharaju
May 09, 2025
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని సాంబ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దులను దాటి చొరబడ్డే ప్రయత్నం చేసిన పాకిస్థాన్ ఉగ్రవాదులను భారత సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్‌ఎఫ్‌) విజయవంతంగా అడ్డుకున్నారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల్లో ఈ సంఘటనలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మే 8వ తేదీ రాత్రి సరిగ్గా 11 గంటల సమయంలో సాంబ జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని బీఎస్‌ఎఫ్‌ తమ అధికారిక ఎక్స్‌ పోస్టులో ప్రకటించింది. ఈ ఎదురుకాల్పుల్లో కనీసం ఏడుగురు ఉగ్రవాదులు మృతిచెందినట్లు బీఎస్‌ఎఫ్‌ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, పాకిస్థాన్‌కు చెందిన ధన్‌బార్‌ ప్రాంతంలోని ఓ పోస్టును భారత దళాలు ధ్వంసం చేశాయి.

వివరాలు 

ఉరి, జమ్మూ, కశ్మీర్ ప్రాంతాల్లో దాడుల తీవ్రత ఎక్కువ

ఇదే సమయంలో పాకిస్థాన్ వైపు నుంచి నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) పరిసర ప్రాంతాలపై భారీగా షెల్లింగ్‌ కొనసాగుతోంది. ముఖ్యంగా ఉరి, జమ్మూ, కశ్మీర్ ప్రాంతాల్లో ఈ దాడుల తీవ్రత ఎక్కువగా ఉందని ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడి ప్రజలలో భయాందోళనలు పెరిగి, చాలా మంది తమ ఇళ్లను ఖాళీ చేసి భద్రంగా ఉండేందుకు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. పాకిస్థాన్‌తో సరిహద్దులు పంచుకునే రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి.

వివరాలు 

ఆరు జిల్లాల్లోని పాఠశాలలను తాత్కాలికంగా మూసివేత 

రాజస్థాన్‌ రాష్ట్రంలో 1,037 కిలోమీటర్ల పొడవున్న సరిహద్దు ప్రాంతాన్ని పూర్తిగా సీల్‌ చేశారు. సరిహద్దు వద్ద ఎవ్వరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వారిపై కాల్పులు జరిపేలా ఆదేశాలు జారీ చేశారు. భారత వాయుసేన కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇక పంజాబ్‌ ప్రభుత్వం కూడా ప్రాధాన్యతతో చర్యలు చేపట్టింది. సరిహద్దుకు చేరువగా ఉన్న ఆరు జిల్లాల్లోని పాఠశాలలను తాత్కాలికంగా మూసివేసింది. ఈ జిల్లాల్లో ఫిరోజ్‌పుర్‌, పఠాన్‌కోట్‌, ఫజిల్కా, అమృత్‌సర్‌, గురుదాస్‌పుర్‌, తార్న్‌తరన్‌ ఉన్నాయి. ఈ ప్రాంతాల విద్యార్థుల భద్రత దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.