LOADING...
Jubilee hills bypoll: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక.. మధ్యాహ్నం 2కి విజేత ఎవరో తేలిపోనుంది! 
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక.. మధ్యాహ్నం 2కి విజేత ఎవరో తేలిపోనుంది!

Jubilee hills bypoll: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక.. మధ్యాహ్నం 2కి విజేత ఎవరో తేలిపోనుంది! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 14, 2025
08:14 am

ఈ వార్తాకథనం ఏంటి

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా లెక్కింపు కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉండనుంది. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో ఒక్కో రౌండ్‌ ఫలితానికి కనీసం 40 నిమిషాలు పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు మధ్యాహ్నం 2 గంటలకల్లా తుది ఫలితాలు వచ్చి చేరవచ్చని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. స్ట్రాంగ్‌రూం వద్ద ఏర్పాట్లను గురువారం సమీక్షించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఇదిలావుండగా, రాష్ట్ర సీఎంవో సుదర్శన్‌రెడ్డి కూడా ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.

Details

42 టేబుళ్లపై 10 రౌండ్ల కౌంటింగ్‌ 

స్టేడియంలో రెండు వరుసల్లో, ప్రతి వరుసకు 21 చొప్పున మొత్తం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్‌లో 42 పోలింగ్‌ కేంద్రాలకు చెందిన ఈవీఎంల ఓట్లను ప్రకటిస్తారు. మొత్తం 407 పోలింగ్‌ కేంద్రాల లెక్కింపు పూర్తయ్యేందుకు 10 రౌండ్లు నిర్వహించనున్నారు. కౌంటింగ్‌ ప్రక్రియ కోసం 186 మంది సిబ్బందిని నియమించారు.

Details

మొదటి రౌండ్‌ కాస్త ఆలస్యమే 

ఉదయం 8 గంటలకు ఇంటి వద్ద ఓటేసిన 103 బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపుతో ప్రక్రియ మొదలవుతుంది. వీటి ఫలితం 10-20 నిమిషాల్లోనే బయటపడుతుంది. ప్రతి టేబుల్‌ వద్ద ప్రతి అభ్యర్థి తరఫున ఒక్కో ఏజెంట్‌కు అనుమతి ఉంది. వారి సమక్షంలో ఈవీఎంల సీల్స్‌ను తెరిచి రిజల్ట్‌ బటన్‌ను నొక్కుతారు. ప్రతి కేంద్రానికి వచ్చిన ఓట్ల మొత్తం, అక్కడ నమోదైన పోలింగ్‌ శాతానికి సరిపోవాలనే నిబంధన అమల్లో ఉంటుంది. ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేస్తే, కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌ మరియు రిటర్నింగ్‌ అధికారి కలసి పరిశీలిస్తారు. ఓట్ల లెక్కలో వ్యత్యాసం తేలితే ఆ కేంద్రానికి చెందిన వీవీప్యాట్‌ చీట్లను గుర్తులు ఆధారంగా తిరిగి లెక్కిస్తారు.

Details

ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఫలితాలు

ఎలాంటి ఫిర్యాదులు లేకుంటే ఆ రౌండ్‌ ఫలితాలను కౌంటింగ్‌ అబ్జర్వర్‌ కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. అన్ని రౌండ్లు పూర్తైన తర్వాత రిటర్నింగ్‌ అధికారి తుది ఫలితాన్ని ప్రకటించి విజేతకు ధ్రువపత్రాన్ని అందజేస్తారు. మొత్తం ప్రక్రియ సాయంత్రం 4 గంటలకల్లా పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఫిర్యాదులు ఉన్నా లేకపోయినా, నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్‌ బాక్స్‌ల చీట్లు తప్పనిసరిగా లెక్కించాలన్న నిబంధన ప్రకారం జూబ్లీహిల్స్‌లోనూ అదే విధానం అమలు కానుంది.