LOADING...
Justice Surya kant: నేడు 53వ సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణం

Justice Surya kant: నేడు 53వ సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2025
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ అత్యున్నత న్యాయస్థానం 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సూర్యకాంత్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తి సీజేఐ బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి కావడం ప్రత్యేకం. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ పదవీకాలం ఆదివారం ముగిసింది. జస్టిస్‌ సూర్యకాంత్‌ 1962 ఫిబ్రవరి 10న హరియాణాలోని హిస్సార్‌ జిల్లా కేంద్రంలో జన్మించారు. 1981లో డిగ్రీ పూర్తి చేసి, 1984లో రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్‌ విశ్వవిద్యాలయం నుండి న్యాయ పట్టా పొందారు. అదే సంవత్సరంలో హిస్సార్‌ జిల్లా కోర్టులో న్యాయవాదిగా తన ప్రొఫెషనల్‌ ప్రయాణాన్ని మొదలుపెట్టారు.

వివరాలు 

ముఖ్య కేసుల్లో తీర్పుల రూపకల్పనలో ఆయన పాత్ర

1985లో పంజాబ్-హరియాణా హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. తర్వాత 2001లో సీనియర్‌ న్యాయవాది హోదా పొందారు. ఆపై 2004 జనవరి 9న పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. రెండు దశాబ్దాలుగా అనేక ధర్మాసనాల్లో పనిచేసిన ఆయన, కీలకమైన పలు తీర్పుల్లో భాగస్వామ్యం వహించారు. ఆర్టికల్‌ 370 రద్దు, బిహార్‌ ఓటర్ల జాబితా సవరణ, పెగాసస్‌ వ్యవహారం వంటి ముఖ్య కేసుల్లో తీర్పుల రూపకల్పనలో ఆయన పాత్ర ఉంది. జస్టిస్‌ సూర్యకాంత్‌ కొత్త సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి నేపాల్, భూటాన్, శ్రీలంక, మారిషస్, కెన్యా, మలేసియా దేశాల నుండి వచ్చిన సుమారు 15 విదేశీ ప్రతినిధుల బృందాలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.