LOADING...
Mallikarjun Kharge: 'ఇది డీకే మీటింగ్ కాదు.. కాంగ్రెస్ సభ'.. కార్యకర్తలపై ఖర్గే సీరియస్ 
'ఇది డీకే మీటింగ్ కాదు.. కాంగ్రెస్ సభ'.. కార్యకర్తలపై ఖర్గే సీరియస్

Mallikarjun Kharge: 'ఇది డీకే మీటింగ్ కాదు.. కాంగ్రెస్ సభ'.. కార్యకర్తలపై ఖర్గే సీరియస్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 22, 2026
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాల చర్చకు తావిచ్చే ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా బీకే హరిప్రసాద్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యకర్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ జరుగుతున్న సమయంలో కొందరు కార్యకర్తలు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు మద్దతుగా "డీకే-డీకే" అంటూ నినాదాలు చేయడంతో ఖర్గే అసహనం వ్యక్తం చేశారు. "నోరు మూసుకుని కూర్చోండి. దేశమంతా మీ చేతుల్లోకి వచ్చినట్టుగా ప్రవర్తించకండి. పనికిరాని వాళ్లు" అంటూ కార్యకర్తలను గట్టిగా మందలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నినాదాలు ఆపేందుకు డీకే శివకుమార్ కూడా లేచి కార్యకర్తలను శాంతింపజేయడానికి ప్రయత్నించారు.

వివరాలు 

"వీడియోలు చూస్తా.. చర్యలు తీసుకుంటా": ఖర్గే

ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ, ఇది కాంగ్రెస్ పార్టీ సమావేశమని, ఏ ఒక్క నాయకుడి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేయడం, ఐక్యతను పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. ఒకరు ఒక నాయకుడి పేరు, మరొకరు ఇంకొక నాయకుడి పేరు నినదిస్తే కార్యక్రమం ఉద్దేశం దెబ్బతింటుందని అన్నారు. పార్టీలో క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఖర్గే, కార్యక్రమంలో నినాదాలు చేసిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. "ఎవరు నినాదాలు చేశారో వీడియోల్లో ఉంది. వాటిని పరిశీలించిన తర్వాత క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం" అని స్పష్టం చేశారు.

వివరాలు 

ఇద్దరు నేతల మధ్య అధికార మార్పిడి ఫార్ములాపై చర్చలు

ఇదిలా ఉండగా, 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నెలకొన్న అంతర్గత విభేదాలకు ముగింపు పలకాలని ప్రయత్నిస్తోంది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పదవిపై సిద్ధరామయ్య,డీకే శివకుమార్ వర్గాల మధ్య పోటీ కొనసాగింది. అప్పట్లో సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించగా, డీకే శివకుమార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. తరువాత ఇద్దరు నేతల మధ్య అధికార మార్పిడి ఫార్ములాపై చర్చలు సాగాయి. రెండున్నరేళ్ల తర్వాత డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. చివరకు పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు మే 28న సిద్ధరామయ్య రాజీనామా చేయగా, వారం రోజుల తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

క్రమశిక్షణపై ఖర్గే సీరియస్ హెచ్చరిక

Advertisement