Kerala: కేరళలో యూడీఎఫ్ ఘన విజయం.. సీఎం పదవిపై ఉత్కంఠ
ఈ వార్తాకథనం ఏంటి
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరవుతారన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తాజా ఎన్నికల కమిషన్ ధోరణుల ప్రకారం, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి మెజారిటీ మార్కును దాటి ముందంజలో ఉంది. దీంతో అధికార పగ్గాలు చేపట్టేది ఎవరు అన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న సతీషన్ ముఖ్యమంత్రి పీఠానికి ప్రధాన పోటీదారుడిగా కనిపిస్తున్నారు. అయితే ఈ పదవికి కేవలం ఆయనే కాకుండా కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితల, సురేశ్ కూడా ఆశావహులుగా ఉన్నారు. ముఖ్యమంత్రి పదవిని తనకు ఇవ్వాలంటూ ఎన్నికల ఫలితాలకు ముందే కేసీ వేణుగోపాల్ లేఖ రాసినట్టు సమాచారం వినిపిస్తోంది.
వివరాలు
సతీషన్కే బహిరంగంగా మద్దతు
గత ఐదేళ్లుగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్న సతీషన్కు బలమైన మద్దతు ఉంది. ఎడమపక్ష ప్రభుత్వంపై రాజీపడని పోరాటం చేసిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. యూడీఎఫ్ మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా సతీషన్కే ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని బహిరంగంగా మద్దతు తెలుపుతోంది. ఇదిలా ఉండగా, కేసీ వేణుగోపాల్,రమేశ్ చెన్నితలకు పార్టీ ఉన్నత నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉండటం వారికి బలంగా మారింది. శశి థరూర్, ఎంపీ సురేశ్ పేర్లు కూడా చర్చల్లో వినిపిస్తున్నప్పటికీ, వారి అవకాశాలు తక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వివరాలు
ఆసక్తికరంగా ముఖ్యమంత్రి పదవి
సతీషన్ పరవూర్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంచి రాజకీయ అనుభవాన్ని సంపాదించారు. కాంగ్రెస్ మిత్రపక్షాల మద్దతు కూడా ఆయనకే ఎక్కువగా ఉండటంతో సీఎం రేసులో ఆయన ముందంజలో ఉన్నారు. దీంతో కేరళ ముఖ్యమంత్రి పదవిని ఎవరు చేపడతారన్నది మరింత ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి ఎంపికపై శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
కొత్త తరహా రాజకీయాలు రావాల్సిన అవసరం ఉంది: శశి థరూర్
యూడీఎఫ్ విజయం నేపథ్యంలో శశి థరూర్ మాట్లాడుతూ, "మార్పును కోరుకునే పార్టీగా మేము ముందుకు సాగుతున్నాం. గత పదేళ్లుగా కొనసాగుతున్న రాజకీయ విధానంలో మార్పు తీసుకురావడం అవసరం. కొత్త తరహా రాజకీయాలు రావాల్సిన అవసరం ఉంది" అని తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై స్పందిస్తూ, "ఇప్పుడే ఆ విషయంపై చర్చించడం సమంజసం కాదు. పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఒకరిని పంపుతారు. వారి అభిప్రాయాల ఆధారంగా పార్టీ ఉన్నత నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది" అని చెప్పారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మీడియాతో మాట్లాడుతున్న శశి థరూర్
#WATCH | Thiruvananthapuram, Keralam: Congress-led UDF has crossed the majority mark, according to the latest Election Commission trends.
— ANI (@ANI) May 4, 2026
Congress MP Shashi Tharoor says, "We are a party of change. We want to change the way this government has played politics for ten years, so… pic.twitter.com/3n098UE8Ph