
Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్రదాడి కేసులో కీలక మలుపు.. ఇద్దరు స్థానికుల అరెస్టు!
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ముష్కరులకు సహకరించినట్టు అనుమానంతో పహల్గామ్కు చెందిన ఇద్దరు స్థానికులను అధికారులు అరెస్ట్ చేశారు. బట్కోట్ గ్రామానికి చెందిన పర్వేజ్ అహ్మద్ జోతర్, హిల్ పార్క్కు చెందిన బశీర్ అహ్మద్ జోతర్లను ఉగ్రదాడికి ముందు ముష్కరులకు ఆశ్రయాన్ని కల్పించడం, అవసరమైన సౌకర్యాలు అందించడం వంటి ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. 26 మంది పర్యాటకుల మృతి ఏప్రిల్ 22న పహల్గామ్లోని ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన పాకిస్థాన్ పౌరులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ధృవీకరించింది.
Details
స్థానికులపై అనుమానం
దాడికి ముందు పర్వేజ్, బశీర్లు కొండ ప్రాంతంలోని హిల్ పార్క్ ఏరియాలో ఉన్న ఒక సీజనల్ షెడ్లో ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం, రవాణా సౌకర్యాలు కల్పించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మత ప్రాతిపదికన ఉగ్రవాదులు లక్ష్యాన్ని ఎంచుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సమాచారం ప్రకారం, పహల్గామ్ దాడికి పాల్పడిన ముష్కరులు పాకిస్థాన్లోని అబ్బటాబాద్ నుంచి ముజఫరాబాద్ చేరుకుని, పూంచ్-రాజౌరీ కారిడార్ ద్వారా భారత్ లోనికి ప్రవేశించారు. వారు అంతకుముందే జమ్ముకశ్మీర్లోని స్పినెర్ ఏరియాలో ఉగ్రదాడులకు పాల్పడిన అనుభవజ్ఞులని, రహస్య కదలికలు, యుద్ధతంత్రాలు,జీవన నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ పొందినట్టు అధికారులు తెలిపారు. దాడి అనంతరం ఉగ్రవాదుల కదలికలను గుర్తించడం కష్టతరమని, వారు వినియోగించిన ప్రత్యేక కమ్యూనికేషన్ పద్ధతులు ముష్కరులను పసిగట్టే అవకాశం ఇవ్వలేదన్నారు.
Details
స్థానికుల పాత్రపై కొనసాగుతున్న దర్యాప్తు
డిజిటల్ రికార్డులు, కమ్యూనికేషన్ డేటాను విశ్లేషించడం ద్వారా ముష్కరుల కదలికలను NIA అధికారులు పరిశీలిస్తున్నారు. తదుపరి విచారణలో ఉగ్రవాదులు పలు సేఫ్ హౌసులలో తలదాచుకున్నట్టు, మరికొన్ని ఉగ్రవాద శృంఖలలతో అనుబంధం ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పర్వేజ్, బశీర్లు ఉగ్రవాదులకు సహకరించడం ద్వారా నేరానికి పాల్పడ్డట్టు అధికారులు భావిస్తున్నారు. విచారణలో ముగ్గురు ఉగ్రవాదుల గుర్తింపుతో పాటు, వారు లష్కరే తోయిబాకు చెందిన పాకిస్థాన్ పౌరులని ఈ ఇద్దరూ అంగీకరించారు. పటిష్ట సాక్ష్యాధారాల ఆధారంగా విచారణ కేసులో పోలీసులు రూపొందించిన స్కెచ్లు, సీసీటీవీ దృశ్యాలు, కంటిచూసిన వారి వాంగ్మూలాలు, డిజిటల్ డేటా తదితర పటిష్ట ఆధారాలను NIA సేకరించింది. కేసును పూర్తి చేయకపోయినప్పటికీ, ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు బలంగానే ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.