Kolkata: పిల్లిని కాపాడే ప్రయత్నంలో 8వ అంతస్తు నుంచి పడి మహిళ మృతి
పెంపుడు పిల్లిని రక్షించే ప్రయత్నంలో ఒక మహిళ 8వ అంతస్తు నుండి పడి దురదృష్టవశాత్తు మరణించింది. ఈ విషాదకర ఘటన కోల్కతాలోని టోలీగంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. చనిపోయిన మహిళను అంజనా దాస్గా గుర్తించారు. నెల రోజుల క్రితం లేక్ ఎవెన్యూ రోడ్డులోని సొసైటీలో అంజనా అద్దెకు ఇల్లు తీసుకుంది. తన తల్లితో ఆమె నివసిస్తోంది. ఈ క్రమంలో ఆమె పిల్లిని పెంచుకుంటోంది. అయితే తన పెంపుడు పిల్లి అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. పిల్లి కోసం అంజనా వెతుకుతుండగా, భవనం పై అంతస్తులోని టార్పాలిన్లో పిల్లి ఇరుక్కుపోయి కనిపించింది. ఈ క్రమంలో పిల్లిని కాపాడే ప్రయత్నంలో ఆమె కాలుజారి కిందపడింది. వెంటెనే చుట్టుపక్కల వారు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.