
GST Reforms: పండగ సీజన్లో జీఎస్టీ ఆదా ఉత్సవం జరుపుకుందాం.. ప్రజలకు మోదీ బహిరంగ లేఖ!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీ సంస్కరణల ప్రాముఖ్యతను వివరించారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సంస్కరణలు ఖర్చులను తగ్గించి సమాజంలోని ప్రతి వర్గానికి ప్రత్యక్ష ప్రయోజనం కలిగిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. 'దేశవ్యాప్తంగా జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వచ్చాయి. ఇవి ప్రజల జీవితాల్లో సానుకూల ప్రభావం చూపుతున్నాయి. జీఎస్టీ మిగులు సంబరాలకు నాంది పలికిందని సోమవారం దేశ ప్రజలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను సోషల్ మీడియాలో కూడా పోస్టు చేశారు. 2047నాటికి 'వికసిత భారత్' లక్ష్యాన్ని సాధించడంలో ఈ సంస్కరణలు కీలకమని మోదీ తెలిపారు. 'ఈ సంవత్సరం పండగ సీజన్ మరో ఆనందాన్ని అందించింది. రైతులు,మహిళలు, యువత, పేద, మధ్య తరగతి, వ్యాపారులకు జీఎస్టీ సంస్కరణలు ప్రత్యక్ష లాభాలు అందిస్తున్నాయి.
Details
దేశీయ ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలి
దుకాణదారులు 'జీఎస్టీ ముందు, జీఎస్టీ తరువాత' అంటూ ధరల బోర్డులు ప్రదర్శించడం సంతోషకరమని ఆయన అన్నారు. రూ.12 లక్షల వార్షిక ఆదాయం వరకు ఆదాయపన్ను సున్నా శాతం చేయడం ద్వారా ప్రజలకు పెద్ద ఊరట లభించిందని మోదీ వెల్లడించారు. ఆదాయపన్ను రాయితీలు, జీఎస్టీ సంస్కరణల కలయికతో దేశ ప్రజలకు రూ.2.5 లక్షల కోట్ల ఆదా కలుగుతోందని వివరించారు. 2017లో అమలులోకి వచ్చిన జీఎస్టీ, ప్రజలు, వ్యాపార సంస్థలను బహుళ పన్నుల భారాల నుంచి విముక్తి కల్పించిందని ఆయన గుర్తుచేశారు. 'భారతీయ దుకాణదారులు, వ్యాపారులు దేశంలోనే ఉత్పత్తయిన వస్తువులను మాత్రమే విక్రయించాలి. ఈ పండగ సీజన్ను 'జీఎస్టీ ఆదా ఉత్సవంగా జరుపుకుందాం అంటూ ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు.