Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాలపై వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక జారీ చేసింది. ఈ రోజు,రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతం, దాని పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అదేవిధంగా, దక్షిణ కర్ణాటక నుంచి మహారాష్ట్ర వరకు వ్యాపించిన ద్రోణి ఈరోజు ఉత్తర కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని పేర్కొన్నారు.
వివరాలు
రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం
ఉత్తర కోస్తా,దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని అంచనా. అయితే రేపటికి అక్కడ పొడి వాతావరణం కొనసాగవచ్చని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణమే నెలకొనే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే మూడు రోజుల్లో కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు ఉండబోవని అధికారులు స్పష్టం చేశారు.
వివరాలు
తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం నివేదికలో పేర్కొన్నారు. కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణలోని కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.