Richest People in Hyderabad: హైదరాబాద్లో అత్యంత ధనవంతులు జాబితా రిలీజ్.. టాప్లో ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్లో అత్యంత ధనవంతుల జాబితా తాజాగా విడుదలైంది. ఈ జాబితాలో దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి దివి కుటుంబం సుమారు రూ.91,100 కోట్ల నెట్వర్త్తో హైదరాబాద్లోనే అత్యంత సంపన్నులుగా తొలి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (MEIL) సంస్థకు చెందిన పిచ్చి రెడ్డి రూ.42,650 కోట్ల సంపదతో ఉన్నారు. మూడో స్థానంలో పి.వి. కృష్ణ రెడ్డి రూ.41,810 కోట్ల నెట్వర్త్తో నిలిచారు. నాలుగో స్థానంలో హెటెరో ల్యాబ్స్కు చెందిన బి. పార్థసారధి రెడ్డి రూ.39,030 కోట్ల సంపదతో ఉండగా, ఐదో స్థానంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్కు చెందిన కే. సతీష్ రెడ్డి కుటుంబం రూ.39,000 కోట్ల నెట్వర్త్తో కొనసాగుతోంది.
Details
ఆరవ స్థానంలో ఆరోబిందో ఫార్మా
ఆరవ స్థానంలో ఆరోబిందో ఫార్మాకు చెందిన పి.వి. రామ్ప్రసాద్ రెడ్డి రూ.35,000 కోట్ల సంపదతో ఉన్నారు. అలాగే బయాలజికల్ ఈ సంస్థను నడిపిస్తున్న మహిమ దత్ల కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇక ఏడో స్థానంలో సోలార్ ఎనర్జీ రంగానికి చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ అధినేత సురేందర్ సలూజా కుటుంబం నిలిచింది. ఎనిమిదో స్థానంలో రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన జూపల్లి రామేశ్వర్ రావు ఉన్నారు.
Details
వందమందికి పైగా వెయ్యికోట్ల ఆస్తులు
తదుపరి స్థానాల్లో అపర్ణ కన్స్ట్రక్షన్స్కు చెందిన సుబ్రమణ్యం రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి నిలవడం విశేషం. మొత్తంగా చూస్తే హైదరాబాద్లోని అత్యంత ధనవంతులు ప్రధానంగా ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, సోలార్ ఎనర్జీ రంగాల నుంచి ఎదిగినవారే కావడం గమనార్హం. తాజా అంచనాల ప్రకారం హైదరాబాద్లో రూ.1,000 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన వారు 100 మందికి మించి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో దేశంలో ముంబై, ఢిల్లీ తర్వాత మూడో స్థానంలో హైదరాబాద్ నిలవడం విశేషంగా పేర్కొనబడుతోంది.