
AP Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. మత్స్యకారులకు వేటకు వెళ్లకూడదని హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోడూరు మండలం, పాలకాయత్తిప్ప సముద్రతీరంలో అల్లకల్లోల పరిస్థితి ఏర్పడింది. సముద్రంలో ఏడు నుంచి ఎనిమిది మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడుతున్నాయి. స్థానిక పోలీసులు సముద్రం వద్దకు వెళ్లే పర్యాటకులను వెనక్కి పంపుతూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మత్స్యకారులు కూడా సముద్రంలోకి వెళ్లకుండా వేట బోట్లు, వలలు సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచాలని మత్స్యశాఖ అధికారులు సూచించారు. కోడూరు మండల ఇన్ఛార్జి తాహసీల్దార్ సౌజన్య కిరణ్మయి కూడా మత్స్యకారులకు ఈ విషయంలో కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
Details
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మరోవైపు బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనివలన పశ్చిమ, వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేశారు. దీని వల్ల రాబోయే మూడురోజులలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం, బుధవారం నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు కురవనున్నాయి. డా.బీఆర్. అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని సూచించారు.