Bihar: బీహార్లో ఎల్పీజీ సిలిండర్ల కొరత.. బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు: ఉప ముఖ్యమంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్లోని కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడినట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో, బీహార్ ఉప ముఖ్యమంత్రి,బీజేపీ సీనియర్ నేత సమ్రాట్ చౌదరి(Samrat Choudhary)బ్లాక్ మార్కెటింగ్ లేదా నిల్వలు దాచిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం (మార్చి 11, 2026) ఆయన ఈ విషయంపై స్పందిస్తూ, తప్పిదాలకు పాల్పడిన వారిపై త్వరితంగా,కఠినంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సాధారణ ప్రజలకు గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు సులభంగా అందేలా ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. అయితే, పాట్నా, కైమూర్, దర్భంగా, మోతిహారి, గయా జిల్లాల్లో వినియోగదారులు గ్యాస్ సిలిండర్లు పొందడానికి ఐదు రోజుల వరకు ఆలస్యం అవుతోందని చెబుతున్నారు.
వివరాలు
పాట్నాలో వినియోగదారుల ఆందోళన
పాట్నాలోని రాజేంద్రనగర్, బోరింగ్ రోడ్, కంకర్బాగ్ ప్రాంతాల నివాసితులు ఫోన్ ద్వారా లేదా గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలకు వెళ్లినా సిలిండర్ బుకింగ్ చేయలేకపోతున్నామని ఫిర్యాదు చేస్తున్నారు. కొన్ని చోట్ల గ్యాస్ సిలిండర్లు తీసుకువెళ్తున్న ట్రక్కుల దగ్గరకు వెళ్లి నేరుగా సరఫరా చేయాలని వినియోగదారులు విక్రేతలను కోరుతున్న దృశ్యాలు కనిపించాయి. కైమూర్ జిల్లాలో పోలీసుల సమక్షంలో పంపిణీ కైమూర్ జిల్లాలోని మోహానియా ప్రాంతంలోని దద్వా కాలనీలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఐదు రోజుల తర్వాత ఒక ట్రక్ గ్యాస్ సిలిండర్లతో అక్కడికి చేరిందని, వాటి పంపిణీ పోలీసుల సమక్షంలో నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు.
వివరాలు
గయాలో ఏజెన్సీల వద్ద గుమిగూడిన వినియోగదారులు
"ఇంట్లో వంట చేసేందుకు గ్యాస్ సిలిండర్లు తీవ్రంగా కొరతగా ఉన్నాయి. లాభాల కోసం కొందరు వ్యాపారులు,గ్యాస్ ఏజెన్సీ యజమానులు కలిసి సంక్షోభాన్ని సృష్టిస్తున్నట్టు కనిపిస్తోంది.దీంతో మేము అధిక ధరలకు సిలిండర్లు కొనాల్సిన పరిస్థితి వస్తోంది," అని స్థానిక వ్యాపారి అజిత్ కుమార్ తెలిపారు. గయా పట్టణంలో గ్యాస్ ఏజెన్సీ గోదాముల బయట పెద్ద సంఖ్యలో వినియోగదారులు చేరుతున్నారు. "ఏజెన్సీ ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. గత నాలుగు నుంచి ఐదు రోజులుగా మహిళలు, పురుషులు ఇక్కడికి వచ్చి సిలిండర్ కోసం ఎదురుచూస్తున్నారు," అని అలొక్ కుమార్ తెలిపారు. ఆయన గత ఐదు రోజులుగా ప్రతిరోజూ సైకిల్పై ఏజెన్సీకి వచ్చి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
వివరాలు
బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు: ఉప ముఖ్యమంత్రి
వినియోగదారుల ఫిర్యాదులపై స్పందించిన సమ్రాట్ చౌధరీ, ఎల్పీజీ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్లో పాల్గొన్న వారిపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. "వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం," అని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎల్పీజీ సరఫరాపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని, దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు కూడా వెల్లడించారు. ఇదే సమయంలో బీహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సారాగి ప్రస్తుత పరిస్థితిని "ప్రత్యేక పరిస్థితి"గా పేర్కొన్నారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగానే సరఫరాపై ప్రభావం పడిందని తెలిపారు. గత రెండు వారాలుగా ఈ పరిస్థితి కొనసాగుతోందని, జిల్లాల అధికారులకు కొరత లేకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు.
వివరాలు
సరఫరాలో అంతరాయం లేదని చెబుతున్న గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు
అంతేకాదు, నిల్వలు దాచిపెట్టడం లేదా బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు ముఖ్యమైన సేవల నిర్వహణ చట్టం(ESMA) ను అమలు చేసినట్లు వెల్లడించారు. అయితే, కొన్ని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం సరఫరాలో అంతరాయం లేదని చెబుతున్నారు. పాట్నాలోని రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన గ్యాస్ ఏజెన్సీ యజమాని అభిజిత్ కశ్యప్ మాట్లాడుతూ, గృహ వినియోగ గ్యాస్ సరఫరాలో పెద్ద సమస్య ఏదీ లేదని అన్నారు. అయితే హోటళ్లు, రెస్టారెంట్లకు ఇచ్చే కమర్షియల్ గ్యాస్ సరఫరాను మాత్రం పరిమితం చేసినట్లు తెలిపారు.