Airbus C295: 'మేక్ ఇన్ ఇండియా'కు మరో మైలురాయి.. ఎయిర్బస్ C-295 తొలి పరీక్ష విజయవంతం
ఈ వార్తాకథనం ఏంటి
భారత విమానయాన,రక్షణ రంగ చరిత్రలో గురువారం చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం చోటుచేసుకుంది. దేశంలోనే తయారైన తొలి 'మేడ్ ఇన్ ఇండియా' ఎయిర్బస్ C295 మిలిటరీ రవాణా విమానం విజయవంతంగా తొలి టెస్ట్ ఫ్లైట్ పూర్తి చేసింది. గుజరాత్లోని వడోదరలో ఏర్పాటు చేసిన ఫైనల్ అసెంబ్లీ లైన్ (FAL) నుంచి ఈ విమానం తొలిసారిగా గగనతలంలోకి ఎగిరి కొత్త చరిత్ర సృష్టించింది. విమాన తయారీ పూర్తైన తర్వాత నిర్వహించే అత్యంత కీలక పరీక్షల్లో టెస్ట్ ఫ్లైట్ ఒకటి. ఈ పరీక్ష విజయవంతంగా పూర్తయినట్లు ఎయిర్బస్ డిఫెన్స్ సంస్థ తమ అధికారిక ఎక్స్ వేదికగా వెల్లడించింది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి ఇది ఒక కీలక మైలురాయిగా అభివర్ణించింది.
వివరాలు
భారత సైనిక తయారీ రంగంలో పెద్ద మార్పుకు నాంది
భారత్లో మొత్తం 40 C295 సైనిక రవాణా విమానాలను తయారు చేయాలని ప్రణాళిక ఉండగా,వాటిలో పూర్తిగా దేశీయంగా తయారైన తొలివిమానం ఇదే కావడం విశేషం. ఈ విజయవంతమైన పరీక్షతో ఈ ఏడాది చివరి నాటికి తొలి మేడ్ ఇన్ ఇండియా C295 విమానాన్ని భారత వైమానిక దళానికి అందించే అవకాశం ఏర్పడింది. రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం,ఈప్రాజెక్ట్ భారత సైనిక తయారీ రంగంలో పెద్ద మార్పుకు నాంది పలికింది. ముఖ్యంగా,దేశంలో ఒక ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో మిలిటరీ విమానం తయారు కావడం ఇదే తొలిసారి. ఎయిర్బస్తో కలిసి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్,అలాగే దేశవ్యాప్తంగా విమాన విడిభాగాల తయారీలో పాల్గొంటున్న అనేక సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు(MSMEలు)ఈ ప్రాజెక్ట్ విజయానికి కీలక పాత్ర పోషించాయి.
వివరాలు
హర్షం వ్యక్తం చేసిన భారత వైమానిక దళం
ఈ సందర్భంగా ఎయిర్బస్ సంస్థ భారత వైమానిక దళం,రక్షణ మంత్రిత్వ శాఖ,భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. తమపై ఉంచిన విశ్వాసానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత ఏరోస్పేస్ రంగ భవిష్యత్తును నిర్మించడంలో భాగస్వామ్యం కావడం గర్వకారణమని పేర్కొంది. మరోవైపు, ఈ చారిత్రాత్మక విజయంపై భారత వైమానిక దళం కూడా హర్షం వ్యక్తం చేసింది. తొలి C295 విమానం విజయవంతంగా టెస్ట్ ఫ్లైట్ పూర్తి చేయడం వెనుక పనిచేసిన మొత్తం బృందానికి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపింది.
వివరాలు
C295 ప్రాజెక్ట్ కీలక అడుగుగా నిలవనుంది
ఈ విజయం భారత ఏరోస్పేస్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాల సాధనలో స్వదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీకి దేశం ఇస్తున్న ప్రాధాన్యతను మరోసారి నిరూపించిందని ఐఏఎఫ్ పేర్కొంది. భారత రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా, దేశీయ సాంకేతిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా C295 ప్రాజెక్ట్ కీలక అడుగుగా నిలవనుంది.