Mahua Moitra: మహువా మెయిత్రాపై లోక్సభ వేటు.. సభ నుంచి విపక్షాల వాకౌట్
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ని లోక్సభ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు డబ్బులు తీసుకుని దిగుల సభలో ప్రశ్నలు అడిగారన్న కేసులో ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను లోక్సభ ఆమోదించింది. ఎంపీ మహువా అనైతికంగా, అమర్యాదకరంగా ప్రవర్తించారని కమిటీ చేసిన తీర్మానాన్ని సభ అంగీకరించింది. ఫలితంగా ఆమె ఎంపీగా కొనసాగడం తగదని స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు.దీంతో మహువా లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఎథిక్స్ కమిటీ నివేదికను శుక్రవారం మధ్యాహ్నం లోక్సభలో ప్రవేశపెట్టారు.పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ తీర్మానాన్ని పెట్టగా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
ఓటింగ్'కు ముందు చర్చకు పట్టుబట్టిన విపక్షాలు
ఎథిక్స్ కమిటీ నివేదికపై అధ్యయనానికి మరింత సమయమివ్వాలని, నివేదికపై ఓటింగ్కు ముందు సభలో చర్చ జరపాలని టీఎంసీతో పాటు విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే నివేదికపై కొంతసేపు చర్చించేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి మంజూరు చేశారు. దీంతో అధికార,విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఇదే సమయంలో చర్చలో మాట్లాడేందుకు అవకాశమివ్వాలని మహువా కోరగా సభాపతి తిరస్కరించారు.అనంతరం మూజువాణీ ఓటింగ్ ద్వారా ఈ నివేదికను లోక్సభ ఆమోదించింది. ఈ మేరకు మహువాను సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించేశారు.అనంతరం సభను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. ప్రభుత్వం తీరుకు నిరసినగా విపక్షాలు వాకౌట్ చేశాయి. వేటు అనంతరం తమ ఇంటికి సీబీఐ వస్తుందేమోనని మహువా ఆందోళన వ్యక్తం చేశారు.