Intermediate: ఏపీ ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులు.. 26 మార్కులు వస్తే పాస్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు పెద్ద శుభవార్తను అందించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో, 2025-26 విద్యా సంవత్సరం నుండి ఇంటర్ విద్యార్థుల పాస్ శాతం, పాస్ మార్కుల విధానంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు, ఏపీ ఇంటర్ బోర్డు తాజా ఉత్తర్వులు విడుదల చేసింది. ముఖ్యంగా గణితంలో (మ్యాథ్స్) 1ఏ, 1బీ పేపర్లు ఒకే సబ్జెక్ట్గా విలీనం చేయబడ్డాయి. ఇంతకుముందు ఒక్కో పేపర్కి 75 మార్కులు ఉండేవి, అయితే ఇప్పుడు మ్యాథ్స్ ఒక్కటే పేపర్గా 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. పాస్ మార్కులను 35 మార్కులుగా నిర్ణయించారు.
వివరాలు
ఫస్టియర్లో 85 మార్కులకు పరీక్ష, పాస్ మార్కులు 29..
బైపీసీ విద్యార్థుల విషయంలో,బోటనీ,జూలజీ సబ్జెక్టులను బయాలజీగా కలిపి ఒకే సబ్జెక్ట్గా మార్చారు. ఫస్ట్ ఇయర్లో బయాలజీ పరీక్షను 85 మార్కులకు నిర్వహిస్తారు, అందులో 29 మార్కులు సాధిస్తే పాస్గా పరిగణిస్తారు. సెకండ్ ఇయర్లో మాత్రం 30 మార్కులు పొందితే పాస్ అవుతారు. అదేవిధంగా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులకు 30 మార్కుల ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. అయితే, గతంలో ఫెయిల్ అయ్యి ఇప్పుడు మళ్లీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ కొత్త నియమాలు వర్తించవని విద్యాశాఖ అధికారులు స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, విద్యాశాఖ మరో కొత్త మార్పును కూడా తీసుకువచ్చింది. ఎలక్టివ్ సబ్జెక్ట్ విధానంను ప్రవేశపెట్టింది. అంటే, ఏ గ్రూప్ విద్యార్థులైనా మొత్తం 24 సబ్జెక్టులలో తామిష్టమైన సబ్జెక్ట్ను ఎంచుకునే అవకాశం కల్పించింది.