
Men group: ఏపీలో డ్వాక్రా సంఘాల మాదిరిగా పురుషుల గ్రూపుల ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో పేదల రుణ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం వినూత్న చర్యలను ప్రారంభించింది. డ్వాక్రా సంఘాల మాదిరిగానే పురుషుల గ్రూపులను ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టింది. ఈ గ్రూపుల ద్వారా పొదుపు అలవాటు చేయించడంతో పాటు బ్యాంకుల నుంచి రుణాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మొదటి దశలో అనకాపల్లిలో 28 గ్రూపులు ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పటివరకు 20 గ్రూపులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. డ్వాక్రా సంఘాల తరహాలో, ఐదుగురు సభ్యులతో కామన్ ఇంట్రస్ట్ గ్రూపులు (సీఐజీ) ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళల కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన విధానాన్ని ఇప్పుడు పురుషులకు వర్తింపజేస్తున్నారు.
వివరాలు
రూ.75,000 నుంచి రూ.1 లక్ష వరకు రుణం
వీటిలో వాచ్మెన్లు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, రిక్షా కార్మికులు, జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్, భవన నిర్మాణ కార్మికులు వంటి వృత్తుల వారు 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటే గ్రూపులో చేరవచ్చు. ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డుతో అనకాపల్లి జీవీఎంసీ జోనల్ ఆఫీస్లో దరఖాస్తు చేయడం ద్వారా ఈ గ్రూపులలో చేరవచ్చు. ప్రభుత్వం ఈ గ్రూపులకు ప్రారంభ దశలో రూ.75,000 నుంచి రూ.1 లక్ష వరకు రుణం అందించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది.
వివరాలు
ఇప్పటి వరకు 20 సీఐజీ గ్రూపులు
ఇప్పటి వరకు 20 సీఐజీ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు యూసీడీ పీడీ వై. సంతోష్ కుమార్ తెలిపారు. ఐదుగురు సభ్యులు ఉంటే ఎంత మంది కావాలంటే అంత మంది గ్రూపులు ఏర్పాటు చేయగలమని స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాల మాదిరిగానే, రుణాలు సక్రమంగా చెల్లిస్తే బ్యాంకులు రుణ పరిమితిని పెంచుతాయని పేర్కొన్నారు.