LOADING...
West Bengal: బీజేపీ,ఈసీపై పశ్చిమబెంగాల్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
బీజేపీ,ఈసీపై పశ్చిమబెంగాల్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

West Bengal: బీజేపీ,ఈసీపై పశ్చిమబెంగాల్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2025
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమం చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లో కూడా ఈ ప్రక్రియను అమలు చేయాలని నిర్ణయించింది. అయితే, దీనిపై రాష్ట్ర మంత్రి ఫిర్హాద్‌ హకీమ్‌ (Firhad Hakim) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఆయన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్రంగా ఖండించింది. ఎస్‌ఐఆర్‌ అమలు విధానం,దాని ఉద్దేశ్యం గురించి వివరించేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) అన్ని పార్టీలను ఆహ్వానిస్తూ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

వివరాలు 

అలా చేయడానికి ప్రయత్నిస్తే వారి కాళ్లు విరగ్గొడతా

ఈ సమావేశానికి హాజరైన హకీమ్, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, "భాజపా, ఈసీతో చేతులు కలిపి పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు కోసం ప్రయత్నిస్తున్నాయి" అని ఆరోపించారు. అంతేకాకుండా, "అలా చేయడానికి ప్రయత్నిస్తే వారి కాళ్లు విరగ్గొడతా" అని వివాదాస్పద వ్యాఖ్య చేశారు. అలాగే, నిజమైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతోందని హకీమ్ విమర్శించారు. "పశ్చిమ బెంగాల్‌లో ఒక నిజమైన ఓటరు పేరు కూడా తొలగించేందుకు మేము అనుమతించము" అని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది: ప్రదీప్‌ భండారీ

ఇక హకీమ్‌ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం (EC)ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. అయితే భాజపా నాయకులు మాత్రం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడైన హకీమ్, ఎన్నికల సంఘాన్ని బెదిరించడం అనాగరికమని భాజపా జాతీయ ప్రతినిధి ప్రదీప్‌ భండారీ అన్నారు. "టీఎంసీ రాజ్యాంగ సంస్థలపై బహిరంగ బెదిరింపులు చేస్తోంది. ఇది హింసను రెచ్చగొట్టడమే కాకుండా అక్రమ చొరబాటుదారులను కాపాడే ప్రయత్నం. టీఎంసీ ఓటు బ్యాంకు కోసం హింసకు ప్రోత్సాహం ఇస్తుందా?" అని ప్రశ్నించారు. ఇక ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ, "బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు రెండో దశలో భాగంగా 12 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియను చేపట్టనున్నాం" అని వెల్లడించారు.

వివరాలు 

రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించిన పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలు 

మొత్తం మీద, హకీమ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్‌ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి, ఇక ఎన్నికల సంఘం తదుపరి నిర్ణయం ఏదన్నదానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.