LOADING...
Mamata Banerjee: అసెంబ్లీ రద్దుతో మమత ముందున్న మార్గం ఏంటి?.. రాజ్యాంగం ఏం చెబుతోంది?
అసెంబ్లీ రద్దుతో మమత ముందున్న మార్గం ఏంటి?.. రాజ్యాంగం ఏం చెబుతోంది?

Mamata Banerjee: అసెంబ్లీ రద్దుతో మమత ముందున్న మార్గం ఏంటి?.. రాజ్యాంగం ఏం చెబుతోంది?

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2026
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించడంతో గవర్నర్ ఆర్.ఎన్. రవి శాసనసభను అధికారికంగా రద్దు చేశారు. అసెంబ్లీ గడువు గురువారం అర్ధరాత్రితో ముగియనున్న నేపథ్యంలో రాజ్‌భవన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174(2)(బి) ప్రకారం తనకు ఉన్న అధికారాలను వినియోగించి మే 7 నుంచి శాసనసభను రద్దు చేస్తున్నట్లు గవర్నర్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయ వివాదం న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

రాజ్యాంగం ఏం చెబుతోంది?

ప్రస్తుత పరిస్థితులపై రాజ్యాంగ నిపుణులు వివరణ ఇస్తున్నారు. విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీకి చెందిన స్వప్నిల్ త్రిపాఠి అభిప్రాయం ప్రకారం, ఆర్టికల్ 174(2)(బి) కింద అసెంబ్లీ రద్దు అయిన తర్వాత మంత్రిమండలికి రాజ్యాంగబద్ధమైన స్థితి ఉండదని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు తాత్కాలికంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చని,అది కూడా గవర్నర్ నిర్ణయంపై ఆధారపడుతుందని వివరించారు. ఇది కేవలం రాజ్యాంగ సంప్రదాయం మాత్రమేనని, ఖచ్చితమైన నిబంధన కాదని చెప్పారు. ఈ మార్పు దశను నిర్వహించడంలో గవర్నర్‌కు విస్తృతమైన విచక్షణాధికారం ఉంటుందని స్పష్టం చేశారు. మమతా బెనర్జీ రాజీనామాకు నిరాకరించినా రాజ్యాంగపరంగా పరిస్థితుల్లో మార్పు ఉండదని పేర్కొన్నారు.

వివరాలు 

మమత ముందున్న మార్గాలు

తదుపరి దశలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో మెజారిటీ ఉన్న నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించాల్సి ఉంటుందని తెలిపారు. ఇక మమతా బెనర్జీకి ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేందుకు రాజ్యాంగబద్ధంగా అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు. శాసనసభ లేకుండా ప్రభుత్వం కొనసాగడం సాధ్యం కాదని, ముఖ్యమంత్రి పదవికి అవసరమైన ప్రజాస్వామ్యబద్ధమైన అధికారం ఎమ్మెల్యేల మద్దతుతోనే వస్తుందని వివరించారు. అసెంబ్లీ రద్దవడంతో ఆ అధికారం కోల్పోయినట్లేనని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఎన్నికల ప్రక్రియ లేదా ఫలితాలపై అభ్యంతరాలుంటే, ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం ఎన్నికల పిటిషన్ దాఖలు చేయడం సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. సంబంధిత హైకోర్టులో పిటిషన్ వేసి, నిర్దిష్ట నియోజకవర్గంలో చట్ట ఉల్లంఘనలు జరిగాయని నిరూపించాల్సి ఉంటుందని తెలిపారు.

Advertisement