అనుకూలించని వాతావరణం; మమతా బెనర్జీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సిలిగురి సమీపంలోని సెవోక్ ఎయిర్ బేస్లో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. మమతా బెనర్జీ జల్పైగురిలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించి బాగ్డోగ్రా విమానాశ్రయానికి వెళుతున్న ఆమె హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు చెప్పారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం వల్లే పైలెట్ అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడని ఓ అధికారి వెల్లడించారు. ఈ క్రమంలో మమతా బెనర్జీ రోడ్డు మార్గంలో బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకుని తిరిగి కోల్కతాకు బయలుదేరినట్లు ఆయన పేర్కొన్నారు. జులై 8న పోలింగ్ జరగనున్న పంచాయతీ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి ఉత్తర పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.