Page Loader
Munir Ahmed: పాక్ మహిళతో పెళ్లి.. ఉద్యోగం పోయింది.. మోదీనే న్యాయం చేయాలి
పాక్ మహిళతో పెళ్లి.. ఉద్యోగం పోయింది.. మోదీనే న్యాయం చేయాలి

Munir Ahmed: పాక్ మహిళతో పెళ్లి.. ఉద్యోగం పోయింది.. మోదీనే న్యాయం చేయాలి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 04, 2025
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థానీ మహిళను పెళ్లాడిన విషయంలో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మునీర్‌ అహ్మద్‌ ఉద్యోగం నుంచి తొలగించిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ పరిణామం నేపథ్యంలో మునీర్‌ తాజాగా జాతీయ మీడియాతో స్పందించాడు. పాక్‌ మహిళను పెళ్లి చేసుకున్న విషయాన్ని అధికారులు తెలియజేయలేదనడం నిరాధారం అని, తాను అప్పుడే సమాచారాన్ని అందించినట్లు స్పష్టం చేశాడు. తన దగ్గర దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పాడు. '2024లో మెనల్‌ ఖాన్‌తో పెళ్లి జరిగింది. 2022 నుంచే ఆమెతో సంబంధం ఉందని అధికారులకు చెబుతూనే ఉన్నా. ఇప్పుడు నా తప్పేమిటి? అంటూ మునీర్‌ ప్రశ్నించాడు.

Details

మోదీ దృష్టికి తీసుకెళ్తా

ఉద్యోగం నుంచి తొలగించారన్న వార్త విన్న వెంటనే షాక్‌కి లోనయ్యానని, తాను అన్యాయం జరిగిందని వాపోయాడు. తనపై తీసుకున్న చర్య న్యాయసమ్మతమయ్యేలా లేదని, ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ వివాహ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భారత ప్రభుత్వం ఇప్పటికే భారత్‌లో ఉన్న పాక్‌ జాతీయులు తమ స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేయగా, మునీర్‌ భార్య మెనల్‌ ఖాన్‌ వ్యవహారం అధికారుల దృష్టికి వచ్చింది.

Details

వీడియో కాల్ ద్వారా వివాహం

ఆమెకు మంజూరైన వీసా గడువు ముగిసినా, ఆమె ఇప్పటికీ భారత్‌లోనే ఉన్నారని అధికారులు తెలిపారు. సీఆర్పీఎఫ్‌ 41వ బెటాలియన్‌కు చెందిన మునీర్‌ అహ్మద్‌ గతేడాది మేలో పాక్‌ మహిళ మెనల్‌ ఖాన్‌ను వీడియో కాల్‌ ద్వారా వివాహం చేసుకున్నాడు. ఆమె వీసాపై భారత్‌కు చేరుకున్న తర్వాత తన ఉనికిని గోప్యంగా ఉంచారని అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలను మునీర్‌ ఖండించాడు. "వాస్తవాలు ప్రభుత్వానికి తెలిసేలా ఎప్పుడో చెప్పాను. కావాలనే నన్ను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగం నుంచి తొలగించారని వ్యాఖ్యానించాడు.