
Fish Prasadam: చేప ప్రసాదానికి భారీ ఏర్పాట్లు.. ప్రత్యేకంగా 140 స్పెషల్ బస్సులు ఏర్పాటు!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సెంట్రల్ జోన్ డీసీపీ వెల్లడించిన వివరాల ప్రకారం, షెడ్లు, ఫ్లడ్ లైట్లు, క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
ఆస్తమా తదితర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు బత్తిన కుటుంబ సభ్యులు ఏటా ఉచితంగా ఈ ప్రసాదం అందిస్తున్న విషయం తెలిసిందే.
ఈ ఏడాది కూడా జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది.
చేప ప్రసాదం పొందడానికి అవసరమైన టోకెన్లను శనివారం (జూన్ 7) నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే పంపిణీ చేశారు.
Details
పలు రాష్ట్రాల నుంచి భారీగా తరలిస్తున్న ఆస్తమా బాధితులు
అయితే టోకెన్ల పంపిణీ ఆలస్యంగా ప్రారంభం కావడంతో వేలాది మంది క్యూలైన్లలో నన్నాడుతూ అసహనం వ్యక్తం చేశారు.
కేవలం రెండు కౌంటర్లతో పంపిణీ చేపట్టడంతో అక్కడికి చేరుకున్న జనం ఒక్కసారిగా ఎగబడటంతో అప్రమత్తమైన అధికారులు పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేశారు.
చేప ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 10 గంటలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్ లు ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి పలు రాష్ట్రాల నుండి ఆస్తమా బాధితులు భారీగా తరలివస్తున్నారు.
ఇప్పటికే వేలాది మంది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకున్నారు.
Details
42 క్యూలైన్లు ఏర్పాట్లు
ఈసారి చేప ప్రసాదం పంపిణీకి ఏకంగా 42 క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
రవాణా సౌకర్యాలకూ ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం, ప్రత్యేకంగా ఆర్టీసీ 140 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. జూన్ 8న 60, జూన్ 9న 80 బస్సులు నడపనున్నారు.
సాధారణ ఛార్జీలకే ఈ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ప్రయాణికుల సంఖ్య బట్టి అదనపు బస్సులు నడిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ ప్రసాదం ప్రధానంగా ఆస్తమా, అబ్బసం, దగ్గు, దమ్ము వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలున్న వారికి అందించబడుతుంది.
సుమారు 170 సంవత్సరాల నుంచీ ఈ సంప్రదాయ కార్యక్రమం కొనసాగుతుండగా, రోగుల కోసం భోజనం, వసతి వంటి సౌకర్యాలు కూడా ప్రభుత్వం అందిస్తోంది.