Mysore: మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరంలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 25 గురువారం రాత్రి మైసూరు (Mysore)లోని అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు తీవ్రతకు ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన అనంతరం స్థానికులు వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. గ్యాస్ సిలిండర్ పేలుడే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన మైసూరు నగర ప్రజల్లో తీవ్ర భయాందోళనలను కలిగించింది.
Details
కేసు నమోదు చేసిన పోలీసులు
కమిషనర్ సీమా లట్కర్, డీసీపీ కె.ఎస్. సుందర్రాజ్ నేతృత్వంలో నగర పోలీసులు ఎఫ్ఎస్ఎల్ బృందం, యాంటీ సబోటేజ్ చెక్ బృందం, డాగ్ స్క్వాడ్ వంటి ప్రత్యేక బృందాలతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు, గాయపడిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై నజర్బార్డ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా, మైసూరు ప్యాలెస్ ప్రాంగణంలో వాసుకి వైభవ్ సంగీత కచేరీ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు హాజరయ్యారు. ప్రేక్షకులు సంగీతంలో లీనమై ఆస్వాదిస్తున్న సమయంలోనే ప్యాలెస్ గేటు సమీపంలో ఈ పేలుడు సంభవించింది.
Details
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు
ప్రమాదంలో రాణేబెన్నూర్కు చెందిన 34 ఏళ్ల కొట్రేష్ కాళ్లకు గాయాలవడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. కొట్రేష్ కేఎస్ఆర్టిసి హవేరి డివిజన్లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గురువారం తన భార్య ప్రియాంక, ఇద్దరు పిల్లలతో సెలవుల కోసం మైసూరుకు వచ్చినట్లు సమాచారం. అలాగే, ఈ ఘటనలో మృతిచెందిన వ్యక్తిని మైసూరు ప్యాలెస్లోని జయమార్తాండ గేటు సమీపంలో బెలూన్లకు హీలియం గ్యాస్ నింపి విక్రయించే బెలూన్ వ్యాపారి సలీం (40)గా గుర్తించారు.