Delhi: న్యూయర్ ముందు దిల్లీలో భారీ ఆపరేషన్.. 285 మంది అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
న్యూయర్ వేడుకల సందర్భంగా దిల్లీ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ కార్యాచరణలో పెద్ద ఎత్తున డ్రగ్స్తో పాటు 40కి పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 285 మందిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. 'ఆపరేషన్ ఆఘాత్ 3.0' పేరిట ఆగ్నేయ దిల్లీకి చెందిన పలు ప్రాంతాల్లో పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. వీధి రౌడీలు, నేరస్తులతో సంబంధం ఉన్న అనుమానితులనే ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకొని తనిఖీలు జరిగాయి. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలుగా దీనిని చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Details
పోలీసుల అదుపులో 504 మంది
ఆపరేషన్లో దాదాపు 285 మందిని అరెస్ట్ చేయగా, అదనంగా 504 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి దేశీయంగా తయారుచేసిన 21 పిస్టల్స్, 20 తూటాలు, 27 కత్తులు, పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలిపారు. అలాగే 310 మొబైల్ ఫోన్లు, 231 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇవన్నీ దొంగిలించిన వస్తువులుగా గుర్తించారు.