Andhra Pradesh Rains : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ18 జిల్లాల్లో వర్షాలు, భారీగా ఈదురుగాలులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు మండే ఎండలు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు ఈదురుగాలులు, పిడుగులతో కూడిన అకాల వర్షాలు కష్టాలను పెంచుతున్నాయి. ఇవాళ కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముండగా, అదే సమయంలో 18 జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. బలమైన గాలులు వీచే అవకాశమున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రాష్ట్రంపై ద్రోణి ప్రభావం కొనసాగుతోంది.
వివరాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఈ ప్రభావంతో గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు ఏలూరు,చిత్తూరు, తిరుపతి, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు, పిడుగులు కూడా పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. పలు ప్రాంతాల్లో గాలులు తీవ్రంగా వీచే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం పడుతున్న సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు,కూలీలు,పశువుల కాపరులు చెట్ల కింద నిలబడకూడదని తెలిపారు. అలాగే విద్యుత్ స్తంభాలు,ప్రకటన బోర్డులు ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండి,సురక్షితమైన చోటుకి వెళ్లాలని సూచించారు.
వివరాలు
తోవిలో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత
ఇదే సమయంలో ఎండల తీవ్రత కూడా తగ్గేలా కనిపించడం లేదు. బుధవారం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వేడి నమోదైంది. కర్నూలు జిల్లా తోవిలో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ కూడా ఇదే స్థాయిలో వేడి కొనసాగుతుందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం, పోలవరం జిల్లా చింతూరు, గుర్తేడు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అలాగే ముంచింగిపుట్టు, ఏలూరు జిల్లా వేలేరుపాడు, పోలవరం జిల్లా కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో కూడా వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేశారు.