Microsoft: రూ.1,772 కోట్లతో ఏపీలో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి..
ఈ వార్తాకథనం ఏంటి
ఐటీ రంగంలో ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ ఏపీలో రూ.1,772.08 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ పెట్టుబడుల్లో భాగంగా అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ వ్యాలీలో 1,200 క్యూబిట్ల సామర్థ్యంతో (50 లాజికల్ క్యూబిట్స్) అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన చర్చలు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు,ప్రభుత్వ అధికారుల మధ్య పూర్తి స్థాయిలో ముగిశాయి. ఈ ప్రణాళికను అమలు చేయడానికి సుమారు 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక భవనం నిర్మించాలి అని అధికారులు తెలిపారు. ఇదివరకే అమరావతిలో 133 క్యూబిట్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయేందుకు ఐబీఎం సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
వివరాలు
క్వాంటమ్ వ్యాలీపై మరిన్ని కంపెనీల దృష్టి
క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడుల కోసం ఇతర అంతర్జాతీయ కంపెనీలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. జపాన్కు చెందిన ఫుజిసు సంస్థ 64 క్యూబిట్ సామర్థ్యమైన క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయడమే కాకుండా,కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యక్రమం కింద కేటాయించే నిధులకు సమానంగా అదనంగా 50%పెట్టుబడి పెట్టి ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ సెంటర్ను కూడా నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ప్రభుత్వం,క్వాంటమ్ పరిశోధనల్లో నిమగ్నమయ్యే సంస్థలకు దశలవారీగా మొత్తం 90లక్షల చదరపు అడుగుల మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం నిర్మించనున్న ఐకానిక్ టవర్ పూర్తికావడంతో అందులోనే 40వేలకు పైగా చదరపు అడుగుల స్థలం పరిశోధన,అభివృద్ధి అవసరాలకు సిద్ధమవుతుంది. ఈ టవర్ నమూనా రూపకల్పనను ఎల్ అండ్ టీ సంస్థ రూపొందించింది.