Andhra Pradesh: ఏపీలో డబుల్ వాతావరణం.. ఒకవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ లో రానున్న రెండు రోజుల పాటు భిన్న వాతావరణ పరిస్థితులు కనిపించనున్నాయి. కొన్ని జిల్లాల్లో తీవ్ర ఎండలు కొనసాగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్ర-పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, రాయలసీమ పరిసరాల్లో మరో ఉపరితల ఆవర్తనం ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల కారణంగా సోమవారం, మంగళవారం రోజుల్లో మేఘావృతమైన వాతావరణం నెలకొని, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.
వివరాలు
ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు సోమవారం పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలుల ప్రభావం కనిపించనుంది.
వివరాలు
సుర్రుమంటున్న ఎండలు
రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా పెరిగాయి. ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం, నెల్లూరు జిల్లా నెల్లూరుపాలెంలో గరిష్ఠంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా రేణిగుంటలో 42.3, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 41.8, వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో 41.5 డిగ్రీలు నమోదయ్యాయి. అలాగే కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 41.3, చిత్తూరు జిల్లా పలమనేరు, ప్రకాశం జిల్లా చెరువుకొమ్ముపాలెంలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు సమాచారం.