BJP: మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వానికి 12 ఏళ్లు.. 'విజయాల' ప్రచారానికి బీజేపీ భారీ ప్రణాళిక
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి నిన్నటితో 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. దశాబ్దానికి పైగా సాగిన ఈ పాలనను సుపరిపాలన, అభివృద్ధి, జాతీయ మార్పుకు ప్రతీకగా భారతీయ జనతా పార్టీ పేర్కొంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. ప్రభుత్వ పాలనలో సాధించిన 22 కీలక విజయాలను ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, ఎంపీలు, పార్టీ నేతలు రంగంలోకి దిగనున్నారు. గత 12 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, ఆర్థిక మార్పులు, డిజిటల్ పాలన, విదేశాంగ రంగంలో సాధించిన విజయాలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు బీజేపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.
వివరాలు
'సంకల్పం నుంచి సాఫల్యం' యాత్రగా అభివర్ణించిన నితిన్ నబిన్
ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. 2014 మే 26న ప్రారంభమైన ఈ ప్రయాణం కేవలం ప్రభుత్వ మార్పు మాత్రమే కాదని, దేశ ఆత్మవిశ్వాసం పునరుద్ధరణకు నాంది పలికిన ఘట్టమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం చోటుచేసుకుందని ఆయన తెలిపారు. ఈ 12 ఏళ్ల ప్రయాణాన్ని 'సంకల్పం నుంచి సాఫల్యం వరకు' సాగిన యాత్రగా అభివర్ణించారు. 'అందరి సహకారం,అందరి అభివృద్ధి,అందరి విశ్వాసం,అందరి ప్రయత్నం' అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేసిందని ఆయన చెప్పారు. చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో పాలన సాగిందన్నారు. అభివృద్ధితో పాటు దేశ వారసత్వ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరించారు.
వివరాలు
మోదీ ఒక నిజమైన 'ప్రధాన్-సేవక్': రాజ్నాథ్ సింగ్
ఉగ్రవాదంపై కఠిన చర్యలతో దేశ భద్రత మరింత బలపడిందని, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ఈ 12ఏళ్ల పాలనే బలమైన పునాది అని ఆయన పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా స్పందిస్తూ.. 2014 మే26 భారత అభివృద్ధి చరిత్రలో కొత్త అధ్యాయానికి ఆరంభమని అన్నారు. ఆర్థికాభివృద్ధి నుంచి సామాజిక సంక్షేమం వరకు,స్వావలంబన భారత లక్ష్యం నుంచి డిజిటల్ మార్పుల వరకు,మౌలిక వసతుల విస్తరణ నుంచి జాతీయ భద్రత బలోపేతం వరకు ప్రతి రంగంలో దేశం వేగంగా పురోగమించిందని తెలిపారు. దేశ అభివృద్ధి మరింత సమగ్రంగా మారిందని,ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రజలు కూడా ఇప్పుడు భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నిజమైన ప్రజాసేవకుడిగా పనిచేస్తున్నారని కొనియాడారు.
వివరాలు
ప్రజా సంక్షేమానికి ఒక 'స్వర్ణయుగం': శివరాజ్ సింగ్ చౌహాన్
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. గడిచిన 12 సంవత్సరాలు సేవా భావం, సుపరిపాలన, పేదల సంక్షేమానికి అంకితమయ్యాయని చెప్పారు. ఒకప్పుడు విధానాల స్థబ్దతతో ఇబ్బందులు ఎదుర్కొన్న దేశం ఇప్పుడు సంస్కరణలు, సమర్థ పాలన, పరివర్తన దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ కాలాన్ని భారత పునర్నిర్మాణానికి స్వర్ణయుగంగా అభివర్ణించారు. జనధన్ ఖాతాల ప్రారంభం నుంచి ఆయుష్మాన్ భారత్ వరకు, ప్రధానమంత్రి గృహ పథకం నుంచి డిజిటల్ ఇండియా కార్యక్రమం వరకు అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రధాని మోదీ దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమ రంగాల్లో కొత్త దిశను తీసుకువచ్చారని ఆయన ప్రశంసించారు.