Loading...
Monsoon: ఆగస్టులో మరింత బలపడనున్న నైరుతి రుతుపవనాలు.. 14 శాతానికి దేశంలో వర్షపాతం లోటు: ఐఎండీ
14 శాతానికి దేశంలో వర్షపాతం లోటు: ఐఎండీ

Monsoon: ఆగస్టులో మరింత బలపడనున్న నైరుతి రుతుపవనాలు.. 14 శాతానికి దేశంలో వర్షపాతం లోటు: ఐఎండీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2026
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో నైరుతి రుతుపవనాలు ఆగస్టు తొలి పక్షంలో మరింత బలపడనున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ)తెలిపింది. గత కొన్ని వారాలుగా దేశంలోని పలు ప్రాంతాల్లో అసమానంగా కురిసిన వర్షాల తర్వాత ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడుతున్నాయని పేర్కొంది. తాజా వర్షపాతం అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా నమోదైన రుతుపవనాల వర్షలోటు ప్రస్తుతం 14శాతానికి తగ్గింది. సీజన్ ప్రారంభంలో నమోదైన అధిక లోటుతో పోలిస్తే ఇది గణనీయమైన మెరుగుదలగా ఐఎండీ వెల్లడించింది. ప్రస్తుతం మహారాష్ట్ర మీదుగా కదులుతున్న లోతైన అల్పపీడనం ఈ మార్పుకు ప్రధాన కారణమని వాతావరణ శాఖ వివరించింది. ఈ వ్యవస్థ అరేబియా సముద్రం,బంగాళాఖాతం నుంచి పెద్దఎత్తున తేమను భూభాగంలోకి తీసుకువస్తోంది. దీంతో రుతుపవనాలు మరింత చురుకుగా మారి విస్తృతంగా వర్షాలు కురిసే పరిస్థితులు ఏర్పడ్డాయి.

వివరాలు 

పశ్చిమ భారతదేశంలో విస్తృతంగా భారీ వర్షాలకు అనుకూల పరిస్థితులు 

ఇదే సమయంలో అరేబియా సముద్రం నుంచి భారత ఉపఖండం వైపు తేమను తీసుకువచ్చే శక్తివంతమైన తక్కువ ఎత్తులో వీచే గాలుల ప్రవాహమైన సోమాలీ జెట్ కూడా బలపడింది.

లోతైన అల్పపీడనం, చురుకైన రుతుపవన ద్రోణి, బలమైన సోమాలీ జెట్ ప్రభావం కలిసి మధ్య, పశ్చిమ భారతదేశంలో విస్తృతంగా భారీ వర్షాలకు అనుకూల పరిస్థితులను సృష్టించాయని ఐఎండీ తెలిపింది.

ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, ఈ వాతావరణ వ్యవస్థ రానున్న రోజుల్లో పశ్చిమ దిశగా మరింత ముందుకు సాగే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఐఎండీ గణాంకాల ప్రకారం మధ్య భారతదేశం, వాయువ్య భారతదేశంలో సీజనల్ వర్షపాతం ప్రస్తుతం సాధారణ స్థాయికి చేరువలో ఉంది.

వివరాలు 

ఆగస్టు ప్రారంభంలో బంగాళాఖాతంలో మరోసారి కొత్త అల్పపీడన వ్యవస్థలు ఏర్పడే అవకాశం: ఐఎండీ

అయితే దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాలు, తూర్పు మరియు ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఇంకా వర్షలోటు కొనసాగుతోంది.

గత వారం రోజులలో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వర్షపాతం గణనీయంగా మెరుగుపడినట్లు అధికారులు వెల్లడించారు.

ఆగస్టు ప్రారంభంలో బంగాళాఖాతంలో మరోసారి కొత్త అల్పపీడన వ్యవస్థలు ఏర్పడే అవకాశముందని ఐఎండీ అంచనా వేస్తోంది.

వీటి ప్రభావంతో మధ్య, పశ్చిమ, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో చురుకైన రుతుపవన పరిస్థితులు కొనసాగి విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇదే ధోరణి కొనసాగితే దేశవ్యాప్తంగా వర్షలోటు మరింత తగ్గే అవకాశముందని, జలాశయాల్లో నీటి నిల్వలు పెరగడంతో పాటు ఖరీఫ్ పంటలకు మేలు జరిగి వ్యవసాయ ఉత్పాదకత కూడా మెరుగుపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.

ADVERTISEMENT