LOADING...
CEC Gyanesh Kumar: సీఈసీ గ్యానేశ్ కుమార్‌పై పార్లమెంట్‌లో తొలగింపు నోటీసు.. తర్వాతి ప్రక్రియ ఏమిటి?
తర్వాతి ప్రక్రియ ఏమిటి?

CEC Gyanesh Kumar: సీఈసీ గ్యానేశ్ కుమార్‌పై పార్లమెంట్‌లో తొలగింపు నోటీసు.. తర్వాతి ప్రక్రియ ఏమిటి?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 13, 2026
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలంటూ పెద్ద రాజకీయ చర్చ మొదలైంది. లోక్‌సభకు చెందిన కనీసం 130 మంది ఎంపీలు, రాజ్యసభకు చెందిన 63 మంది ఎంపీలు కలిసి ఆయనను తొలగించాలని నోటీసుపై సంతకాలు చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. ఈ నోటీసును మార్చి 13 శుక్రవారం రోజున పార్లమెంట్‌లోని రెండు సభల్లో కనీసం ఒక సభలో సమర్పించే అవకాశం ఉందని సమాచారం. అయితే మొదటగా ఏ సభలో దీనిపై చర్చ జరుగుతుందనే విషయం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు.

వివరాలు 

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి సిద్దమవుతున్న భారత ఎన్నికల సంఘం

నియమాల ప్రకారం లోక్‌సభలో సీఈసీని తొలగించాలని నోటీసు ఇవ్వాలంటే కనీసం 100 మంది ఎంపీల సంతకాలు అవసరం. రాజ్యసభలో అయితే కనీసం 50 మంది ఎంపీలు సంతకం చేయాలి. ఈ నోటీసుపై ఇండియా బ్లాక్‌కు చెందిన అన్ని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఆ కూటమిలో లేకపోయినా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు కూడా దీనికి మద్దతు ఇచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో భారత ఎన్నికల సంఘం అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి సిద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లోనే సీఈసీపై తొలగింపు నోటీసు రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

వివరాలు 

సీఈసీపై తొలిసారి నోటీసు

భారత ఎన్నికల కమిషన్ చరిత్రలో సీఈసీని పదవి నుంచి తొలగించాలని కోరుతూ నోటీసు ఇవ్వడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. ఈ నోటీసులో ప్రతిపక్షం కనీసం ఏడు ఆరోపణలను పేర్కొన్నట్లు సమాచారం. అధికారంలో ఉండగా పాక్షికంగా, వివక్షతో వ్యవహరించారని, ఎన్నికల అక్రమాలపై దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని, భారీ స్థాయిలో ఓటర్ల హక్కులను దూరం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఓటర్ల జాబితాలపై జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో గ్యానేశ్ కుమార్ అధికార పార్టీ బీజేపీకి సహాయం చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రక్రియ కేంద్రంలోని కాషాయ పార్టీకి ప్రయోజనం కలిగించడానికే జరుగుతోందని వారు అంటున్నారు.

Advertisement

వివరాలు 

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై కూడా నోటీసు

ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ఈ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిజమైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేశారు. ఇటీవలే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై కూడా ఇలాంటి నోటీసు వచ్చింది. అయితే లోక్‌సభలో వాయిస్ ఓటింగ్ ద్వారా ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.

Advertisement

వివరాలు 

సీఈసీని ఎలా తొలగిస్తారు?

సీఈసీని పదవి నుంచి తొలగించే విధానం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానంతో సమానంగా ఉంటుంది. అంటే నిరూపితమైన దుర్వినియోగం లేదా పనికి అనర్హత ఉన్నట్లు తేలితేనే ఇంపీచ్‌మెంట్ ద్వారా తొలగించవచ్చు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం సీఈసీని సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానంలోనే తొలగించాలి. అలాగే నియామకం తర్వాత ఆయన సేవా నిబంధనలను ఆయనకు అననుకూలంగా మార్చకూడదు. సీఈసీ తొలగింపుపై ప్రతిపాదనను పార్లమెంట్‌లోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఆ ప్రతిపాదన ఆమోదం పొందాలంటే ప్రత్యేక మెజారిటీ అవసరం. అంటే సభ మొత్తం సభ్యుల మెజారిటీతో పాటు హాజరైన సభ్యులలో రెండు మూడవ వంతు మద్దతు అవసరం.

వివరాలు 

దర్యాప్తు కమిటీ ఎలా ఉంటుంది?

చట్టం ప్రకారం సీఈసీని సుప్రీంకోర్టు న్యాయమూర్తి తరహాలోనే తొలగించాలి.అయితే ఇతర ఎన్నికల కమిషనర్లను మాత్రం సీఈసీ సిఫారసు చేసినప్పుడే పదవి నుంచి తొలగించవచ్చు. జడ్జెస్ ఇన్క్వైరీ యాక్ట్, 1968 ప్రకారం రెండుసభల్లో ఒకే రోజు నోటీసు ఇస్తే, రెండు సభలు ఆ ప్రతిపాదనను ఆమోదించిన తర్వాత మాత్రమే దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీని లోక్‌సభ స్పీకర్,రాజ్యసభ ఛైర్మన్ కలిసి ఏర్పాటు చేస్తారు. ఆకమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి,దేశంలోని 25 హైకోర్టుల్లో ఏదైనా ఒక ప్రధాన న్యాయమూర్తి,అలాగే ప్రముఖ న్యాయ నిపుణుడు సభ్యులుగా ఉంటారు. కమిటీ విచారణ కోర్టు విచారణలా సాగుతుంది.ఇందులో సాక్షులను,ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ప్రశ్నిస్తారు. సీఈసీకి కూడా తన వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది.

వివరాలు 

దర్యాప్తు కమిటీ ఎలా ఉంటుంది?

కమిటీ తన నివేదికను సమర్పించిన తర్వాత అది పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఇంపీచ్‌మెంట్‌పై చర్చ ప్రారంభమవుతుంది. చివరికి సీఈసీని తొలగించే తీర్మానం లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ ఆమోదం పొందాలి. పార్లమెంట్‌లో ఈ తీర్మానంపై చర్చ జరిగేటప్పుడు గ్యానేశ్ కుమార్‌కు కూడా తన వాదనను వినిపించే హక్కు ఉంటుంది. సభ ప్రవేశ ద్వారం వద్ద నిలబడి ఆయన తనను తాను సమర్థించుకునే అవకాశం కూడా ఉంటుంది.

Advertisement