Hyderabad Metro: సరికొత్త మైలురాయిని చేరిన హైదరాబాద్ మెట్రోరైలు.. 85 కోట్ల ప్రయాణాలు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్లో నడుస్తున్న మెట్రోరైలు మరో ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఈ నెల 24 నాటికి మొత్తం 85కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చింది. గత ఏడాది డిసెంబరు 19న 80 కోట్ల ప్రయాణికుల సంఖ్యను నమోదు చేసిన మెట్రో,కేవలం 126 రోజుల్లోనే మరో 5 కోట్ల మందిని సేవలందించింది. ప్రస్తుతం రోజుకు సగటున దాదాపు 3.96లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అంతకుముందు ఈ సంఖ్య రోజుకు సుమారు నాలుగున్నర లక్షల వరకు ఉండేది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలులోకి వచ్చిన తర్వాత మెట్రోలో ప్రయాణికుల సంఖ్య కొంత తగ్గిందని సంబంధిత సంస్థ వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
ఆర్టీసీ సమ్మె మొదటి రోజున గరిష్ఠంగా 4.90 లక్షల మంది
ఇదే కాకుండా మెట్రోకు చేరుకునే మొదటి, చివరి దూరాల అనుసంధానం సరిగా లేకపోవడం ఇప్పటికీ ప్రధాన లోపంగా ఉంది. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో బస్సులు ఎక్కడికక్కడ నిల్చిపోతే మెట్రోలో కిక్కిరిసిపోవాలి. కానీ స్వల్ప రద్దీ మినహా అసాధారణంగా ప్రయాణికులు పెరగలేదు. స్వల్పంగా మాత్రమే రద్దీ కనిపించింది. సమ్మె మొదటి రోజున గరిష్ఠంగా 4.90 లక్షల మంది మాత్రమే ప్రయాణించారు. ఐదు లక్షల సంఖ్యను కూడా దాటకపోవడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది.
వివరాలు
ప్రయాణికుల సంఖ్య పెరగాలంటే..
ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు మెట్రో సేవల సమయాల్లో మార్పులు అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే సేవలను ఉదయం 5 గంటల నుంచే ప్రారంభిస్తే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి సౌకర్యంగా ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మెట్రో నిలయాలు ఉన్నందున ఉదయం వేళల్లో సేవలు ప్రారంభించాలని రైల్వే అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై పరిశీలించాలని ప్రభుత్వం మెట్రో ఉన్నతాధికారులకు సూచించింది. అదేవిధంగా రాత్రి 11 గంటలకే ముగుస్తున్న సేవలను కనీసం రాత్రి 12 గంటల వరకు పొడిగించాలని కూడా ప్రయాణికులు కోరుతున్నారు.